తెలంగాణ రాష్ట్రంలో ఆగస్టు 16, సోమవారం నుంచి రైతుల రుణమాఫీ ప్రక్రియ ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ విడతలో ఆగస్టు 30 వరకు రూ.25 వేల నుండి రూ.50 వేల వరకు రుణాలున్న రైతుల రుణాలను తెలంగాణ ప్రభుత్వం మాఫీ చేయనుంది. ఇందుకోసం ప్రభుత్వం ఇప్పటికే రూ.2005.85 కోట్లను విడుదల చేసింది. ఈ నేపథ్యంలో రెండో రోజైన ఆగస్టు 17న రుణమాఫీ కింద రూ.100.70 కోట్లను రైతుల ఖాతాలలో జమ చేసినట్టు తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి వెల్లడించారు. దీంతో 38,050 మంది రైతులకు లబ్దిచేకూరిందన్నారు.
అన్నం పెట్టే రైతు అప్పుల బాధల నుండి బయటపడేయాలన్నదే ముఖ్యమంత్రి కేసీఆర్ ఉద్దేశమని మంత్రి పేర్కొన్నారు. కరోనా విపత్తు నేపథ్యంలో రుణమాఫీకి ఆటంకాలు ఏర్పడ్డాయని, కరోనా విపత్తులో కూడా రైతుల పంటల కొనుగోళ్లకు ఇబ్బందులు రావద్దని వందశాతం పంటలు కొనుగోలు చేసిన ఏకైక రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందన్నారు. ఎన్ని ఇబ్బందులున్నా రైతుల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని రుణమాఫీ అమలు చేస్తున్నామన్నారు. ఇచ్చిన మాట ప్రకారం ఈ ఏడాది రూ.50 వేల వరకు రుణాల మాఫీ పూర్తి చేస్తున్నామని, రాబోయే కాలంలో రెండు విడతలలో రూ.75 వేలు, రూ.లక్ష వరకు రుణాలను ఖచ్చితంగా మాఫీ చేయడం జరుగుతుందని మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ