ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మంగళవారం కోవిడ్ నివారణ చర్యలపై తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, రాష్ట్రవ్యాప్తంగా స్కూళ్లల్లో కోవిడ్ ప్రోటోకాల్స్ పాటించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. స్కూళ్లలో టెస్టింగ్ కు కూడా చర్యలు తీసుకోవాలని, విద్యార్థులు, స్టాఫ్ ఎవరికైనా కరోనా లక్షణాలు కనిపిస్తే వెంటనే పరీక్షలు చేయాలని సూచించారు. వ్యాక్సినేషన్ లో భాగంగా గ్రామ, వార్డు సచివాలయాన్ని యూనిట్గా తీసుకోవాలని తెలిపారు. ప్రాధాన్యతా క్రమంలో వ్యాక్సిన్ వేసుకుంటూ వెళ్లాలని సూచించారు.
మరోవైపు రాష్ట్రంలో ఉదయం 6 నుంచి రాత్రి 11 గంటల వరకు కర్ఫ్యూ సడలింపులు ఉంటాయని సీఎం పేర్కొన్నారు. నైట్ కర్ఫ్యూ అమలు దృష్ట్యా తెల్లవారు జామున పెళ్లిళ్లు ఉంటే ముందస్తు అనుమతి తీసుకోవాలని, పెళ్లిళ్లలో కేవలం 150 మందికే అనుమతి ఉంటుందని చెప్పారు. కోవిడ్ ప్రోటోకాల్స్ పాటించేలా అధికారులు స్వయంగా పర్యవేక్షించాలని సీఎం జగన్ చెప్పారు. ఇక ప్రభుత్వ ఆసుపత్రుల్లో 90 రోజుల్లోగా రిక్రూట్మెంట్ పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రజలకు వైద్య సేవలందించడంలో ఇబ్బందులు రాకూడదని స్పష్టం చేశారు. ఆసుపత్రుల్లో నాడు-నేడు పనులు వేగంగా జరిగేలా చూడాలని సీఎం వైఎస్ జగన్ అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం, వైద్య శాఖ మంత్రి ఆళ్లనాని, వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్, సీఎస్ ఆదిత్యనాథ్ దాస్, డీజీపీ గౌతం సవాంగ్, కోవిడ్ టాస్క్ఫోర్స్ అధికారులు హాజరయ్యారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ