శ్రీశైలం ఎడమ గట్టు జల విద్యుత్ కేంద్రంలో గురువారం రాత్రి భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. జల విద్యుత్ కేంద్రంలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో దట్టంగా పొగలు కమ్ముకున్నాయి. దీంతో సిబ్బంది భయాందోళనకు గురై బయటకు పరుగులు తీశారు. ప్రమాదం జరిగిన సమయంలో 19 మంది ఉద్యోగులు విధుల్లో ఉన్నట్టు తెలుస్తుంది. వీరిలో 10 మంది సొరంగం మార్గం నుంచి బయటకు చేరుకున్నారు. కాగా 9 మంది సిబ్బంది విద్యుత్తు కేంద్రంలోనే చిక్కుకుపోయినట్లు తెలుస్తోంది. మరోవైపు బయటకు వచ్చే క్రమంలో గాయపడిన ఆరుగురి సిబ్బందిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
ప్రమాదం జరిగిన వెంటనే అధికారులు అప్రమత్తమై విద్యుత్ సరఫరా నిలిపివేశారు. తెల్లవారుజాము సమయానికి మంటలు అదుపులోకి వచ్చినప్పటికీ లోపలంతా దట్టంగా పొగలు అలుముకోవడంతో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతుంది. ఫైర్ సిబ్బంది యంత్రాలతో నీళ్లు చల్లుతుండగా రక్షణ సిబ్బంది లోపలి వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. లోపల చిక్కుకున్న 9 మందిని రక్షించేందుకు సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయని తెలంగాణ జెన్ కో సీఎండీ ప్రభాకర రావు తెలిపారు. అలాగే తెలంగాణ రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి, వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్ రెడ్డి ఘటన స్థలానికి చేరుకొని పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారు. ప్రాథమికంగా షార్ట్ సర్కూట్ వలనే మంటలు రేగినట్టుగా భావిస్తుండగా, ప్రమాదానికి గల కారణాలు ఇంకా పూర్తిగా తెలియాల్సి ఉంది.
మరోవైపు శ్రీశైలం విద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో ప్రమాదం పట్ల సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. అక్కడి పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు. ప్లాంట్ లో చిక్కుకున్న వారు క్షేమంగా తిరిగిరావాలని కోరుకున్నారు. ప్లాంట్ వద్ద ఉన్న మంత్రి జగదీష్ రెడ్డి, సీఎండీ ప్రభాకర్ రావు తో సీఎం కేసీఆర్ మాట్లాడి, సహాయక చర్యలను పర్యవేక్షించారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu