తెలంగాణ అసెంబ్లీ కొత్త స్పీకర్గా వికారాబాద్ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్ కుమార్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గడ్డం ప్రసాద్ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు గురువారం అసెంబ్లీలో ప్రోటెం స్పీకర్ అక్బరుద్దీన్ ఓవైసీ అధికారికంగా ప్రకటించారు. ఆ తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క.. గడ్డం ప్రసాద్ కుమార్ను స్పీకర్ స్థానం వద్దకు తీసుకెళ్లి గౌరవ పూర్వకంగా కుర్చీలో కూర్చోబెట్టారు. అనంతరం రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క పూలబొకే ఇచ్చి ప్రసాద్ కుమార్కు అభినందనలు తెలియజేశారు. ఎమ్మెల్యేలు కూడా వరుసగా స్పీకర్ కుర్చీ వద్దకు వచ్చి ప్రసాద్కు శుభాకాంక్షలు తెలియజేశారు.
అయితే స్పీకర్ పదవికి ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్ కుమార్ ఒక్కరే నామినేషన్ దాఖలు చేశారు. ప్రసాద్ కుమార్కు ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్తో పాటు ఎంఐఎం, సీపీఐ ఎమ్మెల్యేలు మద్ధతు తెలపారు. దీంతో తెలంగాణ అసెంబ్లీ కొత్త స్పీకర్గా గడ్డం ప్రసాద్ కుమార్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ప్రోటెం స్పీకర్ అక్బరుద్దీన్ ఓవైసీ ఈ విషయాన్ని అసెంబ్లీలో అధికారికంగా ప్రకటించారు. అంతకంటే ముందు ప్రోటెం స్పీకర్ పలువురు ఎమ్మెల్యేల చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ముందుగా కాంగ్రెస్ నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రమాణస్వీకారం చేశారు. ఆ తర్వాత బీఆర్ఎస్ నుంచి కేటీఆర్, పాడి కౌశిక్ రెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డి పద్మారావులు ఎమ్మెల్యేగా ప్రమాణం చేశారు.
ఇకపోతే 1964లో వికారాబాద్ జిల్లా మర్పల్లి గ్రామంలో గడ్డం ప్రసాద్ కుమార్ జన్మించారు. 2008లో జరిగిన ఉప ఎన్నికల్లో వికారాబాద్ నుంచి కాంగ్రెస్ పార్టీ తరుపున ప్రసాద్ కుమార్ పోటీ చేసి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత 2009లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కూడా విజయం సాధించారు. ఆ తర్వాత 2012లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కిరణ్ కుమార్ రెడ్డి కేబినెట్లో చేనేత, చిన్న తరహా పరిశ్రమల శాఖ మంత్రిగా ప్రసాద్ కుమార్ పని చేశారు.
ఆ తర్వాత 2014, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. ఇక 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ప్రసాద్ కుమార్ తన ప్రత్యర్థి మొతుకు ఆనంద్పై 12, 893 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ప్రసాద్కు 86,885 ఓట్లు పోలయ్యాయి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE