ఈ దఫా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార పార్టీ ఎక్కువగానే పోరాడాల్సి వస్తోంది. కాంగ్రెస్ నుంచి గట్టి పోటీ ఎదురవుతోంది. దీంతో ముఖ్యమంత్రి కేసీఆర్ తన చాణుక్యతను ప్రదర్శిస్తున్నారు. సభలు.. సమావేశాల్లో తనదైన శైలిలో మాటల తూటాలు పేల్చుతున్నారు. అలాగే.. ట్రబుల్ షూటర్ గా మంత్రి హరీశ్ రావును రంగంలోకి దించారు. ఏ నియోజకవర్గంలో బీఆర్ ఎస్ కాస్త బలహీనంగా అనిపిస్తుందో వాటిపై హరీశ్ దృష్టి సారిస్తున్నారు. నేతలకు దిశా నిర్దేశం చేస్తున్నారు. ముఖ్య నాయకులనో, పార్టీ చేజారిన వారినో బీఆర్ ఎస్ లోకి ఆకర్షిస్తున్నారు. పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నారు.
గ్రేటర్ హైదరాబాద్ లోని ఎల్బీనగర్ నియోజకవర్గం బీఆర్ఎస్ ఇన్చార్జ్ ముద్దగోని రామ్మోహన్గౌడ్, ఆయన సతీమణి, మాజీ కార్పొరేటర్ లక్ష్మిప్రసన్న టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి సమక్షంలో అక్టోబర్ 12న కాంగ్రెస్లో చేరారు. అభ్యర్థిగా అవకాశం కల్పించలేదు. వెంటనే హరీశ్ రంగంలోకి దిగారు. ఆర్థిక శాఖ మంత్రి, బీఆర్ఎస్ కీలక నేత హరీష్రావు సమక్షంలో రామ్మోహన్గౌడ్ దంపతులు తిరిగి సొంత గూటికి చేరుకున్నారు. కాంగ్రెస్లో చేరిన రామ్మోహన్గౌడ్ ఆ పార్టీ పట్ల అసంతృప్తితో ఉన్నారని తెల్సుకొని హరీష్రావు ఆయన ఇంటికి వెళ్లారు. బీఆర్ఎస్లోకి ఆహ్వానించి కండువా కప్పారు. శేరిలింగంపల్లి నియోజకవర్గానికి చెందిన ఇద్దరు బీఆర్ఎస్ కీలక నాయకులు అసంతృప్తితో ఉన్న విషయం తెల్సుకున్న కాంగ్రెస్ అగ్రనేతలు వెంటనే రంగంలోకి దిగారు. వారిని పార్టీలో చేర్చుకోవడంతోపాటు శేరిలింగంపల్లి, కూకట్పల్లి అభ్యర్థులుగా ప్రకటించారు. కంటోన్మెంట్లోనూ శ్రీగణేష్ను బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేర్చుకున్నారు.
జూబ్లీహిల్స్ నియోజకవర్గం టికెట్ తనకు దక్కకపోవడంపై కాంగ్రెస్ నేత విష్ణువర్దన్రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. అదే రోజు ఆయనతో బీఆర్ఎస్ నేతలు టచ్లోకి వెళ్లడంతో ప్రగతిభవన్లో మర్యాదపూర్వకంగా సీఎం కేసీఆర్ను కలిశారు. మరునాడు గగన్మహల్లోని విష్ణు ఇంటికి హరీష్రావు వెళ్లారు. అనంతరం తెలంగాణ భవన్లో ఆయన బీఆర్ఎస్లో చేరారు. అసంతృప్తులు లక్ష్యంగా ప్రధాన పార్టీలూ పావులు కదుపుతున్నాయి. ప్రజాబలం ఎంత..? వారి వెంట కేడర్ ఉన్నారా..? లేదా..? అన్నది పట్టించుకోకుండా ఎదుటి పార్టీలో అసంతృప్తిగా ఉండడమే అర్హత అన్నట్టుగా కండువా కప్పుతున్నారు. అగ్రనేతలు అసంతృప్తుల ఇళ్లకు వెళ్లి మరీ ఆహ్వానిస్తుండడం గమనార్హం.
అధికార బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ట్రబుల్ షూటర్ హరీష్రావు నగరంలోనూ చేరికలపై ప్రత్యేక దృష్టి సారించారు. పాత పరిచయాల ఆధారంగా నేతల వద్దకు వెళ్లి అధికార పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు. కాంగ్రెస్కు సంబంధించి ఈ తతంగం గోప్యంగా జరుగుతోంది. కొన్ని సందర్భాల్లో రేవంత్రెడ్డి స్వయంగా రంగంలోకి దిగుతు న్నారు. ఇతర పార్టీల అగ్రనేతల వద్దకు వెళ్లి మంతనాలు జరుపుతున్నారు. ఇక ఫోన్లలో చేరికల సంప్రదింపులు జోరుగా సాగుతున్నాయి. రాష్ట్ర, జిల్లా స్థాయి నేతలు మాత్రమే కాదు.. డివిజన్, బూత్ స్థాయి నాయకులను ఆహ్వానిస్తూ పార్టీని పటిష్టం చేస్తున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ