రాష్ట్రంలో విధుల నిర్వహణలో భాగంగా కరోనా వైరస్ బారిన పడుతున్న వైద్యులు, వైద్య సిబ్బందికి చికిత్స విషయంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై వారికీ హైదరాబాద్ లోని పంజాగుట్టలో గల నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స అందించేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర ప్రజారోగ్య శాఖ డైరెక్టర్ జూలై 8, బుధవారం నాడు నిమ్స్ డైరెక్టర్ కు లేఖ రాశారు.
ప్రస్తుత కరోనా మహమ్మారి పరిస్థితుల్లో, ఫ్రంట్లైన్ వారియర్స్ గా విధులు నిర్వహిస్తున్న చాలామంది వైద్య సిబ్బంది తమ అధికారిక విధులను నిర్వర్తించేటప్పుడు లేదా ఇతరత్రా పరిస్థితుల వలన కరోనా బారిన పడుతున్నారు. వారికి ఆసుపత్రిలో సరైన చికిత్స అవసరం. ఈ నేపథ్యంలో హైదరాబాద్లోని నిమ్స్ ఆసుపత్రిలో కోవిడ్ -19 బారిన పడిన ఆరోగ్య, వైద్య, కుటుంబ సంక్షేమ శాఖ ఉద్యోగులకు చికిత్స అందించాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ ఆదేశించారు. అందువలన ఈ విషయంలో మరింత అవసరమైన చర్యలు తీసుకోవాలని లేఖలో పేర్కొన్నారు. ఈ క్రమంలో ప్రభుత్వ నిర్ణయం పట్ల ఉద్యోగుల జేఏసీ హర్షం వ్యక్తం చేసింది.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu