తెలంగాణ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు గురువారం నాడు హైదరాబాద్ లోని ఎంసీహెచ్చార్డీలో వైద్యారోగ్యశాఖ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ, రాష్ట్రంలో జాతీయ సగటును మించి వ్యాక్సినేషన్ పూర్తయిందని చెప్పారు. బుధవారం నాటికి రాష్ట్రంలో 84.3 శాతం మందికి మొదటి డోస్ పూర్తి కాగా, 38.5 శాతం మందికి రెండో డోస్ వ్యాక్సిన్ వేశారని అన్నారు. అదే సమయంలో జాతీయ స్థాయిలో మొదటిడోస్ 79 శాతంగా, రెండో డోస్ 37.5 శాతంగా నమోదైందని వెల్లడించారు. అలాగే ఈ సమీక్ష సందర్భంగా రాష్ట్రంలో కరోనా పరిస్థితులు, వ్యాక్సిన్ డ్రైవ్, కొత్త మెడికల్ కాలేజీలు, కొత్త మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రుల నిర్మాణం, వరంగల్లోని మల్టీ సూపర్ స్పెషాల్టీ ఆసుపత్రి నిర్మాణం తదితర అంశాలపై అధికారులతో చర్చించారు.
నిర్మాణ పనులు వేగంగా పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని, వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగాన్ని మరింత పెంచాలని అధికారులను మంత్రి హరీశ్ రావు ఆదేశించారు. వ్యాక్సినేషన్ వేగం పెంచడంలో భాగంగా శనివారం అన్ని జిల్లాల కలెక్టర్లు, జిల్లా డీఎంహెచ్వోలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించాలని నిర్ణయించారు. అంతకుముందు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సుక్ మాండవీయతో జరిగిన వీడియో కాన్ఫరెన్స్లో మంత్రి హరీశ్ రావు, వైద్యారోగ్యశాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. రాష్టంలో కరోనా కేసులు, వ్యాక్సినేషన్ కార్యక్రమం గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్యశాఖ కార్యదర్శి రిజ్వి, సీఎం ఓఎస్డీ గంగాధర్, డీఎంఈ రమేశ్రెడ్డి, కాలోజీ వర్సిటీ వీసీ కరుణాకర్ రెడ్డి పాల్గొన్నారు.
సమీక్ష సమావేశంలో అధికారులతో చర్చించిన అనంతరం మంత్రి పలు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకున్నారు. కరోనా తగ్గుముఖం పట్టడంతో 350 పడకలు గల కింగ్ కోఠి జిల్లా దవాఖానలో సాధారణ వైద్యసేవలు పునరుద్ధరణ, టిమ్స్ హాస్పిటల్లో 200 పడకలు (ఇవి కోవిడ్ చికిత్స కోసం) మినహా సాధారణ వైద్య సేవలు ప్రారంభం, టిమ్స్ సిబ్బంది పెండింగ్ జీతాలు చెల్లింపు, టిమ్స్ ఆసుపత్రి బకాయిలు చెల్లింపు సహా వ్యాక్సినేషన్ కార్యక్రమంపై శనివారం అన్ని జిల్లాల కలెక్టర్లు, వీడియో కాన్ఫరెన్స్ చేపట్టాలని నిర్ణయించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ