తెలంగాణ రాష్ట్రంలో గుర్తింపులేని ఇంటర్మీడియట్ కళాశాలలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై ఫిబ్రవరి 27, గురువారం నాడు హైకోర్టులో మరోసారి విచారణ జరిగింది. ఈ సందర్భంగా హైకోర్టుకు ఇంటర్ బోర్డు ఒక నివేదికను సమర్పించింది. కోర్టు ఆదేశాల ప్రకారం అనుమతిలేని ప్రైవేటు కళాశాలలకు నోటీసులిచ్చినట్టు తెలిపింది. అలాగే మార్చి 4వ తేదీ నుంచి ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రారంభమవుతుండడం వలన ఇప్పుడు కళాశాలలు మూసివేస్తే ఆ ప్రభావం విద్యార్థులపై పడుతుందని పేర్కొన్నారు. కళాశాలలు మూసివేస్తే వేల మంది విద్యార్థులు ఇబ్బంది పడతారని, గుర్తింపు లేని అనేక కళాశాలల్లో మొత్తం 29,808 మంది విద్యార్థులున్నారని చెప్పారు. అగ్నిమాపకశాఖ అందించే దృవీకరణ పత్రం లేని కళాశాలల్లోనూ కూడా పరీక్ష నిర్వహణకు ఏర్పాట్లు జరిగాయని అన్నారు.
ఈ నేపథ్యంలో పరీక్షలు ముగిసిన వెంటనే కళాశాలలపై చర్యలు తీసుకునేందుకు అనుమతివ్వాలని ఇంటర్ బోర్డు హైకోర్టును కోరింది. వివరణ అనంతరం హైకోర్టు స్పందిస్తూ అనుమతిలేని కళాశాలలపై చర్యలు తీసుకొని ఏప్రిల్ 3వ తేదీ లోగా నివేదిక సమర్పించాలని ఇంటర్ బోర్డును ఆదేశించింది. ఇటీవలే ఈ అంశంపై ఇంటర్మీడియట్ ప్రైవేటు కళాశాలల యాజమాన్యాలతో తెలంగాణ విద్యాశాఖ ఉన్నతాధికారులు చర్చలు జరిపారు. ఈ సందర్భంగా కోర్టు ఆదేశాల అమలుకు యాజమాన్యాలు సహకరించాలని కోరారు.
[subscribe]