హైదరాబాద్ నగరంలో పరువు హత్య చోటు చేసుకుంది. ప్రేమ వివాహం చేసుకున్న ఓ యువకుడిని యువతి బంధువులు దారుణంగా హత్య చేయించారు. ఈ ఘటన హైదరాబాద్ గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం నాడు జరిగింది. నగరంలోని చందానగర్ ప్రాంతానికి చెందిన హేమంత్, అదే ప్రాంతంలో ఉండే అవంతిని జూన్ 10 న ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరు ఎనిమిదేళ్లుగా ప్రేమించుకుంటుండగా, వీరిద్దరి వివాహానికి యువతి తల్లిదండ్రులు అంగీకరించలేదు. తల్లిదండ్రులు, బంధువుల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో వివాహం అనంతరం గచ్చిబౌలిలోని ఓ కాలనీలో నివాసముంటున్నారు.
ఈ నేపథ్యంలో గురువారం సాయంత్రం అవంతి తరపు బంధువులు, మరి కొందరు గుర్తు తెలియని వ్యక్తులు వీరింటికి చేరుకొని హేమంత్ ను, అవంతి ని కారులో ఎక్కించుకెళ్లారు. మార్గ మధ్యంలో అవంతి కారులోంచి దూకేసి తప్పించుకుంది. అయితే హేమంత్ ను వారితో పాటుగా కారులోనే తీసుకెళ్లారు. ఈ ఘటనకు సంబంధించి హేమంత్ తల్లిదండ్రులు గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. పోలీసులు రంగంలోకి దిగి దర్యాప్తు చేపట్టగా, శుక్రవారం ఉదయం సంగారెడ్డి జిల్లా కొల్లయ్యగూడెం ప్రాంతం వద్ద హేమంత్ శవాన్ని కనుగొన్నారు. తన భర్తను తన బంధువులే దారుణంగా హతమార్చారని వారిని కఠినంగా శిక్షించాలని హేమంత్ భార్య అవంతి డిమాండ్ చేశారు. మరోవైపు హేమంత్ హత్య కేసుకు సంబంధించి ఇప్పటికే 13 మందిపై కేసు నమోదు చేసి, అరెస్ట్ చేసినట్లు మాదాపూర్ డీసీపీ వెల్లడించారు. అవంతి తల్లిదండ్రులు సహా బంధువులే హేమంత్ హత్యలో కీలకపాత్ర పోషించినట్టు ఆయన పేర్కొన్నారు. అవంతి కుటుంబ సభ్యులకు తప్ప బయటి వ్యక్తులకు ఈ హత్యలో ప్రమేయమునట్లు తేలలేదని డీసీపీ తెలిపారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu