తెలంగాణ రాష్ట్రంలోని హుజూరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికకు అక్టోబర్ 30న పోలింగ్ జరగనున్న విషయం తెలిసిందే. ఎన్నికల ప్రచార గడువు కూడా అక్టోబర్ 27, బుధవారం సాయంత్రం 7 గంటలతో ముగిసింది. ఈ నేపథ్యంలో హుజురాబాద్ ఉప ఎన్నిక నిర్వహణపై జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఆర్.వి కర్ణన్, పోలిస్ కమిషనర్ వి.సత్యనారాయణ కలెక్టరేట్ సమావేశ మందిరంలో మీడియాతో మాట్లాడారు. హుజురాబాద్ ఉప ఎన్నిక నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కలెక్టర్ ఆర్ వి కర్ణన్ తెలిపారు. హుజురాబాద్ నియోజకవర్గంలో అక్టోబర్ 28, గురువారం సాయంత్రం 7 గంటల నుండి అక్టోబర్ 30, శనివారం సాయంత్రం 7 గంటల వరకు డ్రై డే గా ప్రకటించామని, అన్ని మద్యం షాపులు, మద్యం విక్రయించే హోటల్స్, రెస్టారెంట్లు, క్లబ్బులు, మొదలైనవి మూసివేస్తున్నట్లు ఆయన తెలిపారు.
అలాగే ఎన్నికల పోలింగ్ కు 72 గంటల ముందు నుండి సైలెన్స్ పీరియడ్ గా ఉంటుందని అన్నారు. అక్టోబర్ 27, బుధవారం సాయంత్రం 7 గంటల నుండి అక్టోబర్ 30, శనివారం వరకు హుజురాబాద్ నియోజకవర్గంలో 144 సెక్షన్ అమలులో ఉంటుందని, ఎలాంటి సభలు సమావేశాలు నిర్వహించడానికి వీలులేదని తెలిపారు. ఎక్కడా కూడా ఐదుగురు కంటే ఎక్కువ గుమికూడవద్దని అన్నారు. హుజురాబాద్ ఉప ఎన్నికల నిర్వహణ సందర్భంగా కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చిన ఆదేశాల మేరకు కోవిడ్ నిబంధనలు పకడ్బంధీగా అమలు చేస్తామని కలెక్టర్ తెలిపారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ