రాష్ట్రంలో శాసనసభ, శాసనమండలి సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో అందరి శ్రేయస్సు దృష్ట్యా శాసనసభ, శాసన మండలి సభ్యులు సెప్టెంబర్ 14, సోమవారం నాడు సభ ప్రారంభానికి ముందే కరోనా పరీక్షలు చేయించుకోవాలని తెలంగాణ రాష్ట్ర శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డి, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. కరోనా మహమ్మారి వ్యాప్తి ఎక్కువగా ఉన్నందున అందరి క్షేమం దృష్ట్యా మంత్రులు, శాసనసభ్యులు, మండలి సభ్యులు సోమవారం ఉదయం 9 గంటల లోపు శాసనసభ భవనం, శాసనమండలి భవనాలలో వైద్య, ఆరోగ్య శాఖ ఆద్వర్యంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కౌంటర్ లలో కరోనా పరీక్షలు చేయించుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు.
అదే విధంగా అసెంబ్లీ సిబ్బంది, కౌన్సిల్ సిబ్బంది, మార్షల్స్, మీడియా రిపోర్టర్లు మరియు సమావేశాల కోసం బందోబస్తుకై కేటాయించిన పోలీసు సిబ్బందికి కూడా కరోనా పరీక్షలు చేయించాలని లేజిస్లేటివ్ సెక్రటరీ వి.నరసింహచార్యులును ఆదేశించారు. సిబ్బంది అందరికి ఆదివారం సాయంత్రం అసెంబ్లీ, కౌన్సిల్ ప్రాంగణాలలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కౌంటర్లలో పరీక్షలను నిర్వహించనున్నారు. విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులు అందరు కూడా తప్పనిసరిగా కరోనా పరీక్షలు చేయించుకోవాలని ఆదేశించారు. కరోనా నేపథ్యంలో అందరూ పరీక్షలు చేయించుకుని సహకరించాలని స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డి మరియు చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu