సెప్టెంబర్ 17ను పురస్కరించుకుని తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల వేడుకలు మొదలయ్యాయి. శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాలలో భారత జెండాను చేతబట్టి మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు, విద్యార్థులు, సామాన్య ప్రజలు.. ఇలా ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. దీనిలో భాగంగా రేపు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నేతృత్వంలో రాజధాని హైదరాబాద్ నగరంలో పలు కార్యక్రమాలు జరుగనున్నాయి. కేంద్ర హోంమంత్రి అమిత్ షా శనివారం ఉదయం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో విమోచన దినోత్సవ ప్రారంభ కార్యక్రమంలో పాల్గొననున్నారు. అనంతరం మధ్యాహ్నం సికింద్రాబాద్ క్లాసిక్ గార్డెన్స్ లో ప్రధాని మోదీ జన్మదినం సందర్భంగా పలు సేవా కార్యక్రమాలకు హాజరవనున్నారు.
మరోవైపు శనివారం ఉదయం ఎన్టీఆర్ స్టేడియంలో సీఎం కేసీఆర్ బహిరంగ సభ జరుగనుంది. ఆ తర్వాత ఎన్టీఆర్ ఘాట్, అంబేద్కర్ విగ్రహం వద్ద కళాకారుల ప్రదర్శనలు వంటి కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమాల్లో పాల్గొనడం కోసం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి బస్సులలో 1 లక్ష మంది సభకు వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. దీంతో నగర పోలీసులు ఎలర్ట్ అయ్యారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా అన్ని ప్రాంతాల్లో భారీగా పోలీసులను మోహరిస్తున్నారు. అలాగే ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ మేరకు నగర కమిషనర్ సీవీ ఆనంద్ ప్రకటించారు. వాహనదారులకు పలు కీలక సూచనలు చేశారు. హైదరాబాద్లోని మొత్తం 9 ప్రధాన జంక్షన్లలో వాహనదారులు రూట్ మార్చుకోవాలని సీపీ ఆనంద్ సూచించారు.
హైదరాబాద్లో శనివారం ట్రాఫిక్ ఆంక్షలు ఇలా..
- నెక్లెస్ రోడ్ , పబ్లిక్ గార్డెన్స్, నిజాం కాలేజ్లో జిల్లాల నుండి వచ్చే వారికి పార్కింగ్ సౌకర్యం ఏర్పాటు.
- లిబర్టీ నుంచి అప్పర్ట్యాంక్ బండ్కు ట్రాఫిక్ను అనుమతించరు. లిబర్టీ వద్ద హిమాయత్నగర్ వైపు మళ్లింపు.
- అశోక్నగర్ నుంచి వచ్చే వాహనాలు బాకారం బ్రిడ్జి నుంచి సీజీవో టవర్స్ బన్సీలాల్పేట్ వైపు మళ్లింపు.
- ఆజామాబాద్ జంక్షన్ నుంచి వచ్చే వాహనాలు వీఎస్టీ క్రాస్రోడ్స్ నుంచి బాగ్లింగంపల్లి వైపు మళ్లింపు.
- సాధురామ్ కంటి ఆస్పత్రి నుంచి వచ్చే వాహనాలు దోమల్గూడ టీ జంక్షన్ నుంచి చిక్కడపల్లి మెట్రో స్టేషన్, ఆర్టీసీ క్రాస్ రోడ్డువైపు మళ్లింపు.
- ముషీరాబాద్ నుంచి ఆర్టీసీ క్రాస్ రోడ్డు మీదుగా ఎన్టీఆర్ స్టేడియం వైపు వచ్చే వాహనాలు ఆర్టీసీ క్రాస్రోడ్డు వద్ద నుంచి నారాయణగూడ క్రాస్రోడ్డు వైపు మళ్లింపు.
- కవాడి గూడ, అశోక్ నగర్, ముషీరాబాద్, ఇందిరా పార్కు, లిబర్టీ, నారాయణ గూడ, రాణిగంజ్, నెక్ లెస్ రోడ్, పలు ఏరియా జంక్షన్లలో ట్రాఫిక్ పూర్తిగా మళ్లింపు.
- ఈ వాహనాలకు కవాడిగూడ ఎక్స్ రోడ్స్ నుంచి బైబిల్ హౌస్ వైపు అనుమతి.
- ఇక్బాల్ మినార్ నుంచి వచ్చే వాహనాలు పాత సచివాలయం గేట్ నుంచి అంబేద్కర్ విగ్రహం మీదుగా లిబర్టీ వైపు మళ్లింపు.
- నారాయణగూడ నుంచి వచ్చే వాహనాలు ఆర్టీసీ క్రాస్రోడ్డు నుంచి ముషీరాబాద్ వైపు మళ్లింపు.
- రాణిగంజ్, ఎంజీరోడ్డు, ఆర్పీరోడ్డు నుంచి వచ్చే వాహనాలు కర్బాలా మైదాన్ నుంచి బైబిల్ హౌస్, ముషీరాబాద్ వైపు మళ్లింపు.
- ఇక తెలుగు తల్లి ఫ్లై ఓవర్, నెక్లెస్ రోడ్డులు పూర్తిగా మూసి ఉంటాయి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY