తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఇది పరీక్షా కాలమే. ఎంతో కష్టపడి పార్టీని నెగ్గించిన ఆయన ముందు ఎన్నో సవాళ్లు ఉన్నాయి. ప్రభుత్వ పరంగా ఆరు గ్యారెంటీల అమలు ఒక ఎత్తయితే.. పార్టీపరంగా రాబోయే లోక్సభ ఎన్నికల్లో ఎక్కువ సీట్లు గెలుచుకోవడం మరో ఎత్తు. ఆయన ప్రస్తుతం ముఖ్యమంత్రే కాదు.. టీపీసీసీ అధ్యక్షుడిగా కూడా ఆయనే కొనసాగుతున్నారు. ప్రభుత్వాన్ని నడిపించే బాధ్యతతో పాటు.. అసెంబ్లీ విజయం పాలపొంగు కాదని నిరూపించుకునేందుకు లోక్ సభ ఎన్నికల్లో మెజార్టీ సీట్లు సాధించే బాధ్యత కూడా ఆయనపైనే ఉంది. దీంతో రేవంత్కు ఇది పరీక్షా కాలమని చెప్పకతప్పదు.
ఆ విషయాన్ని ముందే గుర్తించిన రేవంత్ రెడ్డి లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో పక్కా ప్రణాళికతోనే అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తోంది. పార్టీ అధినేత్రి సోనియాగాంధీని తెలంగాణ నుంచి పోటీ చేయించడం ద్వారా రాష్ట్రంలో మెజార్టీ సీట్లపై ఆ ప్రభావం ఉండేలా వ్యూహరచన చేస్తున్నారు. తాజాగా నిన్న జరిగిన టీపీసీసీ విస్తృత స్థాయి సమావేశంలో సోనియా పోటీపై తీర్మానం కూడా చేశారు. అంతేకాదు.. లోక్ సభ ఎన్నికల గురించి తీవ్రంగా చర్చించారు. గెలుపు కోసం అందరూ కలిసి శ్రమించాల్సిన అవసరం ఉన్న విషయాన్ని గుర్తు చేశారు. పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా సమావేశాలు, సమీక్షల కోసం తేదీలు కూడా ఖరారు చేశారు. కొద్ది రోజుల్లోనే కార్యాచరణ ప్రారంభించేలా ప్రణాళిక సిద్దం చేశారు. దీనిలో భాగంగా ఈ నెల నుకార్యచ 8, 9 తేదీల్లో పార్లమెంట్ పరిధిలోని ఉమ్మడి జిల్లా నేతలతో రేవంత్ రెడ్డి సమావేశం కానున్నారు.
మధ్యలో ఒకరోజు పాలనాపరమైన అంశాలకే పూర్తిగా సమయం కేటాయించి, మళ్లీ 11, 12, 13 తేదీల్లో పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి మంత్రులు, నేతలతో సమావేశమై ఆయా ప్రాంతాల్లో పార్టీ పరంగా ప్రస్తుత పరిస్థితులు, తీసుకోవాల్సిన నిర్ణయాలపై చర్చించే అవకాశాలు ఉన్నాయి. ఆ తర్వాత రేవంత్ 14న దావోస్ పర్యటన కు వెళ్లనున్నారు. తిరిగి వచ్చిన అనంతరం మళ్లీ లోక్ సభ ఎన్నికలపైనే సీరియస్ గా దృష్టి పెడతానని శ్రేణులకు భరోసా ఇచ్చారు. రాష్ట్రంలో ఉన్న 17 స్థానాల్లోనూ విజయం సాధించేలా లక్ష్యం నిర్దేశించుకోవాలని, 12 స్థానాకలు తగ్గకుండా సీట్లు గెలిపించుకోవాలని శ్రేణులకు రేవంత్ ఆదేశాలు జారీ చేశారు. అందుకోసం ఆరు గ్యారెంటీలను పకడ్బందీగా అమలు చేసేలా ప్లాన్ చేస్తున్నారు. పథకాల అమలు కోసం గ్రామ కమిటీలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
అలాగే జోనల్ వ్యవస్థను సమీక్షించేందుకు కూడా ప్రత్యేక కమిటీలకు దిశా నిర్దేశం చేశారు. ఈ మేరకు ఏఐసీసీ కార్యదర్శులు, మంత్రులు, ఎన్నికల, రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులకు, కాంగ్రెస్ జిల్లాల అధ్యక్షులు, అనుబంధ సంఘాల అధ్యక్షులు, పార్టీ అధికార ప్రతినిధులకు కీలక బాధ్యతలు అప్పగించారు. వారిని ఉత్సాహపరుస్తూ పార్లమెంట్ ఎన్నికలు ముగిసిన తర్వాత నామినేటెడ్ పోస్టులను భర్తీ చేస్తానని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీలో కష్టపడి పనిచేసినవారికి పదవులు వస్తాయని, పార్టీ గుర్తింపు ఇస్తుందని రేవంత్ హామీ ఇచ్చారు. ఆరు గ్యారెంటీల అమలు కోసం గ్రామ కమిటీలు ఏర్పాటు చేయడం ద్వారా ప్రభుత్వ పథకాలను ప్రజలకు మరింతగా చేరువ చేయవచ్చని తెలిపారు. హామీలను తూచా తప్పకుండా అమలు చేస్తామన్న సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పారు. మొత్తమ్మీద.. ముఖ్యమంత్రిగా, టీపీసీసీ అధ్యక్షుడిగా తనకు ఎదురవుతున్న ఈ పరీక్షా కాలాన్ని సమర్థవంతంగా ఎదుర్కునేందుకు రేవంత్ శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నారు. అటు పార్టీని, ఇటు పాలనను విజయపథంలో నడిపించి మరోసారి సక్సెస్ అయ్యేలా ముందడుగు వేస్తున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY