తెలంగాణ రాష్ట్రంలో శ్రీ సమ్మక్క–సారలమ్మల మహా జాతర ఫిబ్రవరి 16 నుంచి 19 వరకు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మహిమాన్వితమైన మేడారం జాతర సందర్భంగా తెలంగాణ ప్రజలు, ముఖ్యంగా అడవితల్లి బిడ్డలకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భక్తిపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు.
“బుధవారం నుంచి మొదలవుతున్న సమ్మక్క-సారలమ్మ జాతర భారతీయ సనాతన ధార్మిక వైశిష్ట్యానికి నిలువెత్తు నిదర్శనం. అడవి బిడ్డల వీరత్వానికి, ధీరత్వానికి ప్రతీకలు ఈ దేవతలు. తెలంగాణలో అత్యంత వైభవోపేతంగా జరిగే ఈ వన జాతర దేశానికి తలమానికం. దేశం నలుమూలలోని గిరిజనులు, గిరిజనేతరులు తమ ఇలవేల్పులుగా పూజిస్తున్న ఈ శక్తి స్వరూపిణీల జాతర నయానందకరం, భక్తి ముక్తిదాయకం. మన దేశంలో కుంభమేళా తరవాత కోట్లాదిమంది ఈ జాతరకు ప్రతీసారీ తరలి వస్తున్నారంటే భక్తులు సమ్మక్క సారలమ్మను ఎంతలా ఆరాధిస్తారో అవగతమవుతుంది. కోరిన కోర్కెలు నెరవేర్చే కొంగు బంగారం మేడారం గద్దె అని భక్తుల విశ్వాసం. ఈ జాతర ఆద్యంతం గిరిజన సంప్రదాయంతో నయనానందకరంగా, అనిర్వచనీయమైన ఆధ్యాత్మిక అనుభూతిని కలిగిస్తుంది. తెలంగాణవాసులతో పాటు దేశ ప్రజలందరినీ దుష్ట శక్తుల నుంచి ఈ వనదేవతలు కాపాడి, కరుణ కటాక్షాలతో చల్లగా చూడాలని కోరుకుంటూ ప్రణామాలు అర్పిస్తున్నాను” అని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ