ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీశ్రీశ్రీ త్రిదండి చినజీయర్ స్వామికి దేశ అత్యున్నత మూడో పురస్కారమైన ‘పద్మభూషణ్’ అవార్డు లభించింది. ఈ మేరకు బుధవారం రాత్రి రాష్ట్రపతి భవన్లో వేడుకగా జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయనకు పద్మభూషణ్ పురస్కారాన్ని ప్రదానం చేశారు. చినజీయర్ స్వామితో పాటు ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి సతీమణి సుధామూర్తి కూడా పద్మభూషణ్ పురస్కారం అందుకున్నారు. కాగా త్రిదండి చినజీయర్ స్వామి.. శ్రీ రామానుజాచార్యుల వైష్ణవ ఆచార సంప్రదాయానికి సంబంధించిన వైదిక విలువలను ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేస్తున్న సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా హైదరాబాద్ నగర శివారు ముచ్చింతల్ లోని శ్రీరామనగరం ఆశ్రమంలో శ్రీ రామానుజాచార్యుల వారి ‘సమతామూర్తి’ పేరుతో.. 216 అడుగుల శ్రీ రామానుజాచార్యుల విగ్రహం ప్రతిష్ఠించి సహస్రాబ్ది వేడుకలు నేడు ఘనంగా నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ వేడుకలకు అప్పటి రాష్ట్రపతి రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్, ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా సహా పలు రాష్ట్రాల గవర్నర్లు, ముఖ్యమంత్రులు, ప్రముఖులు హాజరవడం గుర్తుండే ఉంటుంది.
ఈ కార్యక్రమం అనంతరం చినజీయర్ స్వామి మాట్లాడుతూ.. పద్మభూషణ్ అవార్డు లభించడం సంతోషమని, అయితే ఈ అవార్డుతో తాము చేసే సేవా కార్యక్రమాలపై బాధ్యత, జవాబుదారీతనం మరింత పెరిగిందని పేర్కొన్నారు. వికాస్ తరంగిణి, జీయర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ పేరుతో చేసిన సేవా కార్యక్రమాలకు గుర్తింపుగా ప్రభుత్వం పద్మభూషణ్ ప్రదానం చేసిందని తెలిపారు. ప్రజల అవసరాలను గుర్తించి, స్పందించి, అందించే సేవ చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని, ఈ సేవా కార్యక్రమాల్లో పాల్గొన్న వాలంటీర్లకు లభించిన సత్కారమే ఈ అవార్డు అని పేర్కొన్నారు. ఇక ‘స్వీయ ఆరాధన, సర్వ ఆదరణ’ నినాదాన్ని తాము పాటిస్తామని, ఎవరు ఏ మతాన్ని, ఏ ధర్మాన్ని ఆచరించినా.. సామాజిక సేవ విషయంలో అందరం కలసి పనిచేయాలన్నదే ఈ నినాదం లక్ష్యం అని చినజీయర్ స్వామి వివరించారు. స్వధర్మాన్ని ఆచరిస్తూ, ఇతర ధర్మాలను ఆదరిస్తూ.. కుల, మత, ప్రాంత, లింగ బేధాలు లేకుండా అవసరంలో ఉన్న ప్రతి ఒక్కరికీ సేవ చేయాలన్నదే తమ ఉద్దేశం అని స్పష్టం చేశారు.
ఇంకా చినజీయర్ స్వామి మాట్లాడుతూ ఇలా అన్నారు.. ఒకప్పటి ‘మానవ సేవయే మాధవ సేవ’ అనే మాటను ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా ‘సర్వ ప్రాణి సేవయే మాధవ సేవ’’గా మార్చుకోవాల్సిన అవసరం ఏర్పడిందని అన్నారు. భగవంతుడు సర్వాంతర్యామి అని, ఎక్కడ ఏ ఉపద్రవం వచ్చినా భగవంతుడి శరీరానికి హాని కలిగినట్టుగా భావించి, మనం సేవ చేయాలని సూచించారు చినజీయర్ స్వామి. కాగా మహిళలకు గర్భకోశ క్యాన్సర్ల సమస్యకు సంబంధించి వికాస తరంగిణి ట్రస్ట్ ద్వారా విస్తృత సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని, దీనిలో భాగంగా.. ఏపీ, తెలంగాణతో పాటు కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లోనే కాకుండా, పొరుగుదేశం నేపాల్లో సైతం తమ సేవలు అందిస్తున్నామని వెల్లడించారు. ఈ క్రమంలో సుమారు 20 లక్షల మంది మహిళలకు క్యాన్సర్ పరీక్షలు నిర్వహించామని, వీరిలో సుమారు 6-7 లక్షల మందికి క్యాన్సర్ నిర్ధారణ కావడంతో అవసరమైన చికిత్స అందించామని వివరించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE