దేశంలో కోవిడ్-19(కరోనా వైరస్) విజృంభిస్తుండడంతో బాధితుల సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. తాజా సమాచారం ప్రకారం దేశవ్యాప్తంగా 271 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్టు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. తెలంగాణ రాష్ట్రంలో 20 కేసులు నమోదు కాగా, ఆంధ్రప్రదేశ్ లో మూడు పాజిటివ్ కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో కరోనా వైరస్ వ్యాప్తి నివారణలో భాగంగా మార్చ్ 22, ఆదివారం నాడు నిర్వహించే జనతా కర్ఫ్యూలో ప్రజలు అందరూ పాల్గొనాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ప్రధాని మోదీ ప్రకటించిన జనతా కర్ఫ్యూ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పూర్తి స్థాయిలో మద్దతు తెలిపింది. ఇందులో భాగంగా ఆదివారం ఉదయం నుంచి రాత్రి వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆర్టీసీ బస్సు సర్వీసులను నిలిపి వేస్తున్నట్టుగా రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పేర్ని నాని తెలిపారు.
దూరప్రాంతాలకు వెళ్లే బస్సులు కూడా ఈరోజు అర్ధరాత్రి నుంచే నిలిపివేస్తామని పేర్కొంటూ, ప్రైవేటు బస్సుల యాజమాన్యాలు కూడా సహకరించాలని మంత్రి పేర్ని నాని కోరారు. జనతా కర్ఫ్యూలో భాగంగా ఆంధ్రప్రదేశ్ లో రేపు పెట్రోల్ బంకులు కూడా మూతపడనున్నాయి. ఈ మేరకు పెట్రో సమాఖ్య ఒక ప్రకటన విడుదల చేసింది. అత్యవసరమైన వాహనాలకి మాత్రమే పెట్రోల్ మరియు డీజిల్ పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. మరోవైపు కరోనా వైరస్ ప్రభావంతో రాష్ట్ర సచివాలయంలో ఆంక్షలు అమలు చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మార్చ్ 23వ తేదీ నుంచి సచివాలయ ఉద్యోగులను మినహా ఇంకెవరిని సచివాలయంలోకి అనుమతించకూడదని నిర్ణయించారు. అలాగే హైదరాబాద్ సహా దూర ప్రాంతాల నుంచి వచ్చే ఉద్యోగులు తమకు ఇంటి నుంచి పని చేసే అవకాశం కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్నికి వినతి పత్రం అందజేశారు.