నిజామాబాద్ స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. మార్చ్ 19న నామినేషన్ల దాఖలకు ఆఖరి తేదీ కాగా, ఏప్రిల్ 7వ తేదీన ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటలవరకు పోలింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో ఈ ఎమ్మెల్సీ స్థానానికి జరగనున్న ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ తరపున నిజామాబాద్ మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత అభ్యర్థిత్వాన్ని టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కేసీఆర్ ఖరారు చేసినట్టుగా తెలుస్తుంది. ఈ రోజు మధ్యాహ్నం కవిత నిజామాబాద్ లో నామినేషన్ దాఖలు చేసే అవకాశం ఉంది.
ముందుగా బుధవారం ఉదయం కల్వకుంట్ల కవిత మినిస్టర్స్ క్వార్టర్స్ లో స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డిని కలిశారు. స్పీకర్ ని కలిసిన వారిలో కవితతో పాటుగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు చెందిన టిఆర్ఎస్ నేతలు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, జీవన్ రెడ్డి, బిగాల గణేష్ గుప్తా, బాజీరెడ్డి గోవర్థన్ తదితరులు ఉన్నారు. స్పీకర్ ను కలిసిన అనంతరం కవిత అక్కడ నుంచి నేరుగా నిజామాబాద్ వెళ్లినట్టుగా తెలుస్తుంది. నామినేషన్ దాఖలు అనంతరం నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా కవిత ఎన్నిక లాంఛనమే కానుంది.
గతంలో పార్టీ ఫిరాయింపునకు పాల్పడ్డారనే ఆరోపణలతో నిజామాబాద్ ఎమ్మెల్సీ భూపతిరెడ్డిని అప్పటి మండలి ఛైర్మన్ స్వామిగౌడ్ అనర్హుడిగా ప్రకటించారు. ముందుగా టిఆర్ఎస్ సభ్యుడిగా ఎన్నికైన భూపతిరెడ్డి, ఆతర్వాత ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీలో చేరడంతో పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని ఉల్లంఘించాడని ఆయన్ను అనర్హుడిగా ప్రకటించాలని టిఆర్ఎస్ శాసనమండలి పక్షం మండలి ఛైర్మన్కు ఫిర్యాదు చేయడంతో అనర్హత వేటు వేశారు. ఈ అనర్హత వేటు కారణంగా ఖాళీ అయిన ఎమ్మెల్సీ స్థానానికి ఇప్పుడు ఉపఎన్నిక జరగనుంది.
[subscribe]