తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా ఎంపీ రేవంత్రెడ్డి నియామకంపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆదివారం నాడు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ నుంచి హైదరాబాద్ చేరుకున్న ఆయన విమానాశ్రయంలో మీడియాతో మాట్లాడుతూ, పీసీసీ అధ్యక్షుడు గానీ, కొత్తగా ఏర్పడిన కార్యవర్గం గానీ తనను కలిసేందుకు ప్రయత్నించవద్దని అన్నారు. గాంధీ భవన్ టీడీపీ ఆఫీసుగా మారిపోవడం ఖాయమన్నారు. కొత్త కార్యవర్గంతో వచ్చేవాళ్లంతా టీడీపీ వాళ్లే ఉంటారని, వాళ్లను కలిస్తే కాంగ్రెస్ కార్యకర్తలు బాధపడతారన్నారు. జరిగిన పీసీసీ ఎన్నికలో ఒక కార్యకర్తను గుర్తించి ఇస్తారని అనుకున్నానని, ఓటుకు నోటు కేసులో ఏం జరిగిందో ఇక్కడ కూడా అదే జరిగినట్టు తనకు ఢిల్లీ వెళ్లాక తెలిసిందన్నారు. పార్టీ ఇన్చార్జి పీసీసీ పదవిని అమ్ముకున్నారని ఆయన ఆరోపించారు. ఇందుకు సంబంధించిన ఆధారాలను వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో సోనియాగాంధీకి అందిస్తానని అన్నారు. ఒకటే పార్టీలో ఉంటే తమకు న్యాయం జరగదేమో అని కార్యకర్తలు భావించే ప్రమాదముందన్నారు.
ఇకపై తాను గాంధీ భవన్ మెట్లుఎక్కనని చెప్పారు. టీపీసీసీ ఇకపై టీడీపీ పీసీసీగా మారుతుందన్నారు. తన రాజకీయ భవిష్యత్తును కార్యకర్తలే నిర్ణయిస్తారని తెలిపారు. నల్గొండ, భువనగిరి లోక్ సభ స్థానాల పరిధిలో అన్ని అసెంబ్లీ స్థానాల్లో పార్టీ గెలిచేలా పనిచేస్తానని, ఇబ్రహీంపట్నం నుంచి భువనగిరి వరకు పాదయాత్ర చేస్తానని, కొత్త కేడర్ కు ప్రోత్సాహం అందిస్తానని పేర్కొన్నారు. పీసీసీ కొత్త కార్యవర్గాన్ని అభినందిస్తున్నానని, వారి నాయకత్వంలో రాబోయే హుజూరాబాద్ ఎన్నికల్లో డిపాజిట్లు తెచ్చుకోవాలని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్యానించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ