ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధ్యక్షతన ‘సీఎం దళిత సాధికారత పథకం’ విధివిధానాల ఖరారు అంశంపై దళిత ప్రజాప్రతినిధులతో ఆదివారం ప్రగతి భవన్ లో అఖిలపక్ష సమావేశం జరిగింది. అర్హులైన ఎంపిక చేయబడిన లబ్ది దారులకు సీఎం దళిత సాధికారత పథకం ద్వారా ఒక కుటుంబం ఒక యూనిట్ గా, యూనిట్ ఒక్కంటికి 10 లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని నేరుగా వారి వారి బ్యాంక్ ఖాతాల్లో జమ చేయడం ద్వారా అందజేయాలని అఖిలపక్ష సమావేశంలో నిర్ణయించారు. మొదటి దశలో 119 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి నియోజకవర్గానికి 100 కుటుంబాల చొప్పున, రాష్ట్రవ్యాప్తంగా 11,900 ఎంపిక చేయబడిన అర్హులైన దళిత కుటుంబాలకు ఈ ఆర్థిక సాయం అందుతుంది. అలాగే అఖిలపక్ష సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగిన అఖిలపక్ష సమావేశంలో తీసుకున్న కీలక నిర్ణయాలు:
- రాష్ట్రంలోని దళితుల సమస్యలను ఆర్థిక సమస్యలు సామాజిక సమస్యలుగా విడదీసి గుర్తించాలని సీఎం అధికారులను ఆదేశించారు. వాటికి పరిష్కార మార్గాలను చూడాలన్నారు. ఇప్పుడు అమలులో వున్న స్కీమ్ లను కొనసాగిస్తూనే సీఎం దళిత సాధికారత పథకాన్ని వర్తింపజేయనున్నట్టు సీఎం తెలిపారు. గ్రామీణస్థాయిలో పట్టణ స్థాయిలో ప్రవేశపెట్టాల్సిన స్కీంలను వాటి వివరాలను లబ్ధిదారుల గైడెన్స్ కోసం తయారు చేసి అందించాలన్నారు.
- గ్రామీణ ప్రాంతాలలో చేయదగిన స్కీమ్ లు, డెయిరీ, తదితర స్వయం ఉపాధి అవకాశాల విషయంలో గైడెన్స్ ఇచ్చే మెకానిజం ఏర్పాటు చేయాలన్నారు.
- లబ్ధిదారులకు అందిన ఆర్థిక సాయంతో ప్రారంభించిన స్కీమ్ లను ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేయాలి. దీని కోసం మండలస్థాయిలో ఒక అధికారి ఉండాలి. ఇందుకు సంబంధించి ఎస్సీ కార్పోరేషన్ అధికారులు చర్యలు తీసుకోవాలి. అధునాతన సాంకేతిక విధానాలను అవలంబించి ప్రతీ లబ్ధిదారునికి ఓ కార్డును అందజేయాలి. బార్ కోడ్ ను కేటాయించి లబ్ధిదారుని పూర్తి వివరాలు కంప్యూటర్ లో నిక్షిప్తం చేసి ఆన్ లైన్ లో అందుబాటులో ఉంచాలని సీఎం అన్నారు.
- ఎస్సీ కుటుంబాల ప్రొఫైల్ తయారుచేయాలని ఎస్సీ సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ను సీఎం ఆదేశించారు.
- సెంటర్ ఆఫ్ ఎక్స్ లెన్సీ తో, దళిత విధ్యార్థుల కోసం, హై క్వాలిటీ స్టడీ సర్కిల్స్ ను ఎన్ని సెంటర్ లలో పెట్టగలమో పరిశీలించాలని సీఎం అధికారులను ఆదేశించారు. వీటిని రూపొందించాలనీ, ఖర్చు ఎంతయినా ఫరవాలేదని సీఎం స్పష్టం చేశారు. ఈ సెంటర్ల ద్వారా సివిల్ సర్వీసెస్ తో పాటు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు శిక్షణనందించాలని సీఎం ఆదేశించారు.
- దళిత రైతుబంధు లబ్ధిదారుల వివరాలు సేకరించాలని అధికారులను ఆదేశించారు.
- బాటమ్ లైన్ లో ఉన్న దళితులకు సహాయం అందేలా చర్యలు చేపట్టాలని అధికారులక సూచించారు.
- గ్రామీణ దళితులు పట్టణ దళితుల అభివృద్ధి, దళిత యువతకు ఉపాధి అవకాశాల కల్పన, విద్యార్థులకు స్టడీ సెంటర్ల ఏర్పాటు చేయాలని ప్రభుత్వ నిర్ణయం.
- పెండింగులో ఉన్న దళిత ఉద్యోగుల ప్రమోషన్లను 10 నుంచి 15 రోజుల్లో పూర్తి చేయాలి.
- గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయం చేసుకుంటున్న దళిత రైతులకు రైతుబంధుతో పాటు అర్హత కలిగిన వారికి సీఎం దళిత సాధికారత పథకం కూడా వర్తిస్తుందని సీఎం తెలిపారు.
- భూమి ఉన్న దళిత రైతులకే కాకుండా, భూమి లేని నిరుపేద దళిత కుటుంబాలకి కూడా బీమా సౌకర్యాన్ని కల్పిస్తామని సీఎం చెప్పారు.
- దళిత సాధికారత పథకం విషయంలో దళిత శాసన సభా సంఘం బాధ్యత తీసుకోవాలి.
- దళిత ప్రజాప్రతినిధులు నిరంతరం చర్చలు చేసి మంచి నిర్ణయాలు తీసుకోవాలి.
- సామాజిక బాధల నుంచి దళితులకు విముక్తి కలిగించాలి.
- ఇక నుండి దళితుల మీద పోలీసుల దాడులు జరిగితే, పోలీసులను ఉద్యోగం నుంచి డిస్మిస్ చేయాలని అఖిల పక్షం చేసిన నిర్ణయానికి సీఎం ఆమోదం తెలిపారు.
- సమగ్ర దృక్పథంతో తెలంగాణ దళిత సమాజ సమగ్రాభివృద్ధి కోసం నేటి అఖిల పక్షం కీలక నిర్ణయాలు తీసుకున్నది.
- సీఎంఓ లో దళిత సాధికారత విషయంలో ప్రత్యేక అధికారిని నియమిస్తామని సీఎం తెలిపారు.
ఇదే అంశం మీద ప్రత్యేకంగా కలెక్టర్ల సమావేశం నిర్వహించనున్నారు. జూలై 1 నుంచి పదిరోజుల పాటు జరగనున్న పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాల్లో రెండు రోజులు దళిత వాడల సందర్శన, వారి సమస్యల మీద, అభివృద్ధి కార్యక్రమాల మీద వివరాల సేకరణ జరపాలని సీఎం ఆదేశించారు. - జూలై 1 లోపు మొదటి ఎస్సీ శాసనసభా సంఘం సమావేశం జరిపి ఒక జిల్లాను ఎంచుకొని ప్రభుత్వం నుండి రైతుబంధు పొందుతున్న 7,79,902 (13,38,361 ఎకరాలకు గాను) మంది దళిత రైతుల గురించి విచారించి, వాళ్ళకు ఎదురయ్యే ఇబ్బందులను గుర్తించాలని సీఎం తెలిపారు.
- దళితులకు వందశాతం డబల్ బెడ్ రూం ఇండ్ల కేలాయింపు అనే అంశం మీద ఒక స్ట్రాటెజీని రూపొందిస్తామని సీఎం తెలిపారు.
- దళితసాధికరత అమలు కోసం రిటైర్డు దళిత ఉద్యోగులు, ఎన్జీవోల సహకారం తీసుకోవాలని సీఎం సూచించారు.
ఈ అఖిలపక్ష సమావేశంలో ఎస్సీల అభివృద్ధి, సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్, రైతుబంధు సమితి చైర్మన్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎంపీలు వెంకటేష్ నేత బొర్లకుంట, పోతుగంటి రాములు, పసునూరి దయాకర్, ఎమ్మెల్సీలు ఎమ్మెస్ ప్రభాకర్ రావు, డి. రాజేశ్వర్ రావు, గోరేటి వెంకన్న, ఎమ్మెల్యేలు బాల్క్ సుమన్, దుర్గం చిన్నయ్య, హన్మంత్ షిండే, సుంకె రవిశంకర్, రసమయి బాలకిషన్, క్రాంతి కిరణ్ చంటి, కె.మాణిక్ రావు, కాలె యాదయ్య, మెతుకు ఆనంద్, జి.సాయన్న, గువ్వల బాలరాజు, విఎం అబ్రహం, చిరుమర్తి లింగయ్య, గ్యాదరి కిషోర్ కుమార్, తాటికొండ రాజయ్య, ఆరూరి రమేష్, మల్లు భట్టివిక్రమార్క, సండ్ర వెంకట వీరయ్య, సయ్యద్ అహ్మద్ పాషా ఖాద్రి, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట రెడ్డి, మాజీ మంత్రులు కడియం శ్రీహరి, మోత్కుపల్లి నర్సింహులు, మాజీ ఎంపీ మంద జగన్నాథం, మాజీ ఎమ్మెల్యే ఆరేపల్లి మోహన్, ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్ ఎర్రోళ్ళ శ్రీనివాస్, ఎస్సీ కార్పోరేషన్ మాజీ చైర్మన్ పిడమర్తి రవి, టిఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి రావుల శ్రవణ్ కుమార్ రెడ్డి, టిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కృషాంక్, శ్రీధర్ రెడ్డి, సీపిఎం పార్టీ నేతలు బి.వెంకట్, జాన్ వెస్లీ, సిపిఐ నేత బాలనర్సింహా లు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్, సీఎంఓ అధికారులు నర్సింగ్ రావు, భూపాల్ రెడ్డి, స్మితా సభర్వాల్, శేషాద్రి, ప్రియాంక వర్గీస్, శ్రీధర్ రావు దేశ్ పాండే, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణా రావు, ఎస్సీ అభివృద్ధి శాఖ సెక్రటరీ రాహుల్ బొజ్జా, బుద్ధవనం ప్రాజెక్టు ప్రత్యేకాధికారి మల్లేపల్లి లక్ష్మయ్య, ఎస్సీ కార్పోరేషన్ ఎండి కరుణాకర్, ఎస్సీ అభివృద్ధి శాఖ అడిషనల్ డైరక్టర్ ఉమా దేవి, జి.టి.వేంకటేశ్వర్ రావు తదితరులు పాల్గొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ