టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ మార్చ్ 2, సోమవారం నాడు తెలంగాణ భవన్ లో కొత్తగా ఎన్నికైన డీసీసీబీ, డీసీఎంఎస్ ఛైర్మన్లు, వైస్ ఛైర్మన్లతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, తెలంగాణలో రైతుల రుణమాఫీ పక్రియను త్వరలోనే చేపడతామని పేర్కొన్నారు. రుణమాఫీ ప్రక్రియ ప్రారంభించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలు ఇచ్చారని, త్వరలోనే రైతు రుణమాఫీ జరుగుతుందని ఈ విషయంలో రైతులెవరూ ఆందోళన చెందవద్దని తెలిపారు. దేశంలో రైతులకు మొట్టమొదటిసారిగా రైతుబీమా, రైతుబంధు వంటి పథకాలను అందుబాటులోకి తెచ్చిన తొలి రాష్ట్రం తెలంగాణనే అన్నారు. రైతుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎంత ఖర్చుకైనా వెనుకాడటం లేదని చెప్పారు. అలాగే తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన రైతు సమన్వయ సమితి పేరును త్వరలోనే రైతుబంధు సమితిలుగా మార్చబోతున్నట్లు మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు.
మరోవైపు తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా జరిగిన ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల (పీఏసీఎస్) ఎన్నికలు, ఆతర్వాత డీసీసీబీ, డీసీఎంఎస్ ఛైర్మన్లు, వైస్ ఛైర్మన్ల ఎంపికలో టిఆర్ఎస్ పార్టీ తిరుగులేని విజయాన్ని సాధించడం పట్ల కేటీఆర్ సంతోషం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో మొత్తం 906 సంఘాలకు ఎన్నికలు జరిగితే 94 శాతానికిపైగా సంఘాల్లో రైతులు టిఆర్ఎస్ను పార్టీని గెలిపించారని తెలిపారు. అలాగే డీసీసీబీ చైర్మన్లుగా 48 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకే అవకాశం కల్పించినట్టు వెల్లడించారు. మున్సిపల్ చైర్మన్ పదవుల్లోనూ బలహీనవర్గాలకు అవకాశమిచ్చినట్టు పేర్కొన్నారు. రైతుల కోసం ప్రభుత్వం చేపడుతున్న పలు కార్యక్రమాలను ప్రజల వద్దకు తీసుకెళ్లాల్సిందిగా ఛైర్మన్లు, వైస్ ఛైర్మన్లకు కేటీఆర్ సూచించారు. తెలంగాణ భవన్ లో జరిగిన ఈ సమావేశానికి పలువురు మంత్రులు కూడా హాజరయ్యారు.
[subscribe]