నవంబర్ 20 నుండి డిసెంబరు, 1వ తేది వరకు వచ్చే తుంగభద్ర పుష్కరాలను కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా సకల సౌకర్యాలతో నిరాడంబరంగా నిర్వహించటం జరుగుతుందని రాష్ట్ర దేవాదాయ మరియు అటవీ శాఖ మంత్రి ఎ. ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. శనివారం ఉదయం రాష్ట్ర వ్యవసాయ మరియు మార్కెటింగ్ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, రాష్ట్ర పర్యాటక మరియు ఎక్సైజ్ శ్రీనివాస్ గౌడ్, ఇతర ప్రజాప్రతినిధులు, జిల్లా కలెక్టరుతో కలిసి హోటల్ హరితలో తుంగభద్ర పుష్కరాల నిర్వహణపై అధికారులతో సమీక్ష సమావేశము నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తుంగభద్ర పుష్కరాలను ప్రతిసారి నిర్వహించినట్లు ఘనంగా నిర్వహించడానికి అవకాశం లేదని, కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన కోవిడ్ నిబంధనలను పాటిస్తూ కరోనా వ్యాపించకుండా అన్ని కట్టుదిట్టమైన ఏర్పాట్లతో ఈ సారి తుంగభద్ర పుష్కరాలను నిర్వహించటం జరుగుతుందని తెలియజేసారు.
కర్నాటక రాష్ట్రం నుండి తెలంగాణలో జోగుళాంబ గద్వాల జిల్లాలో ప్రవేశించి తుంగభద్రకు ఈ సారి 5 ఘాట్లను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. అలంపూర్, వేణిసోంపూర్, రాజోలి, పుల్లురు, కలుగొట్ల వద్ద పుష్కర ఘాట్లను ఏర్పాటు చేయనున్నట్లు తెలియజేసారు. జిల్లా యంత్రాంగం వివిధ ప్రభుత్వ శాఖలను సమన్వయం చేసుకొని ఆయా శాఖలకు బాధ్యతలు అప్పగించి పుణ్యస్నానం చేయటానికి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలిగించకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని తెలియజేసారు. ముఖ్యంగా పుష్కర ఘాట్ల ఏర్పాట్లు, పారిశుధ్యం, మహిళలకు బబలు మార్చుకునేందుకు గదులు, మరుగుదొడ్లు, మంచినీటి సౌకర్యం, వాహనాలకు పార్కింగ్ షావర్ల ఏర్పాటు వంటి చర్యలు ఆయా శాఖలకు అప్పగించి ఎలాంటి లోటు లేకుండా ఏర్పాట్లు పూర్తి చేయాలన్నారు. దేవాదాయ శాఖ తరపున 5 ఘాట్ల వద్ద ఉన్న దేవాలయాలకు రంగులు వేయించి విద్యుదీకరణ, వచ్చే భక్తులకు దైవ దర్శనానికి అన్ని ఏర్పాట్లు చేయించటం జరుగుతుందని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తెలియజేసారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ ప్రజలు తమ ఆరోగ్యం కాపాడుకోవటంపై శ్రద్ధ తీసుకోవాలన్నారు. పుష్కర స్నానం ఆచరించడానికి చిన్న పిల్లలు, వృద్ధులు రాకుండా చూసుకోవాలని, వచ్చిన భక్తులు శానిటైజేషన్ చేసుకుంటు, భౌతిక దూరం పాటిస్తూ కేంద్రం సూచించిన కోవిడ్ నిబంధనలను పాటిస్తూ పుణ్యస్నానం ఆచరించాలని తెలియజేసారు. ఒకేసారి భక్తులు గుంపుగా గుమికూడకుండా ఆన్లైన్ ద్వారా స్లాట్లు బుక్ చేసుకొని స్లాట్ టైం ప్రకారం పుష్కర ఘాట్కు చేరుకునే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు.
వ్యవసాయ మరియు మార్కెటింగ్ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ పుష్కరాలకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా అన్ని శాఖలను సమన్వయం చేసుకొని పుష్కరాలను విజయవంతం చేయడానికి ఒక ప్రత్యేక అధికారిని ఏర్పాటు చేయవలసిందిగా జిల్లా కలెక్టరును తెలియజేసారు. దాతలను సంప్రదించి సుదూర ప్రాంతము నుండి వచ్చే భక్తులకు ఆర్యవైశ్య సంఘం తరపున అన్నదానము, మంచినీటి సరఫరా, దారిపొడవున ఎల్ఈడి లైట్లు ఇతర సేవలను పొందేవిధంగా చర్యలు తీసుకోవాలన్నారు. నదిలో నీటి ప్రవాహం అధికంగా ఉన్నందున భక్తులు స్నానం ఆచరించుటకు స్ప్రింక్లర్లు, షావర్లు ఏర్పాటు చేయాలని, పిండ ప్రధానం చేసుకునేందుకు ప్రత్యేక స్థలముతో పాటుగా బ్రాహ్మణులను ఏర్పాటు చేయాల్సిందిగా సూచించారు. ప్రతి భక్తునికి థర్మల్ స్కానింగ్ చేయాలని, ఏమైన అనుమానం ఉంటే వెంటనే కోవిడ్ పరీక్షలు నిర్వహించేందుకు వీలుగా ర్యాపిడ్ టెస్ట్ కిట్లను తగిన వైద్య సదుపాయము, డాక్టర్లు అందుబాటులో ఉండే విధంగా చూసుకోవాలని తెలియజేశారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ