బతుకు తెరువు కోసం వలస వెళ్లిన ఓటర్లను.. పోలింగ్ రోజు ఊరికి రప్పించడానికి ప్రయత్నిస్తున్నారు అభ్యర్దులు. వారే ఈ ఎన్నికల్లో తమ భవితవ్యాన్ని మారుస్తారని భావిస్తున్న అభ్యర్థులు.. వారిని ప్రసన్నం చేసుకోవడం కోసం ఇప్పటి నుంచే ప్రయత్నాలు చేస్తున్నారు. కొన్ని నియోజకవర్గాల్లో హైదరాబాద్, ముంబయ్,బెంగళూరు వంటి ప్రాంతాలకు వలస వెళ్లిన ఓటర్లు పదివేల మందికి పైగానే ఉన్నట్లు లెక్కలు ఉన్నాయి.
అన్ని జిల్లాల నుంచి ఏదొక ఉద్యోగం కోసమో, పిల్లల చదువుల కోసమో హైదరాబాద్ వచ్చిన వాళ్లు చాలామంది ఉన్నారు. వీళ్లందరికీ ఇప్పటికీ ఓట్లు, రేషన్ కార్డులు వారి సొంత గ్రామాల్లోనే ఉన్నాయి. ఇప్పుడు వీరిని సొంతూళ్లకు రప్పించేందుకు అభ్యర్థులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసుకుంటున్నారు. వారి అడ్రస్, ఫోన్ నంబరుతో ఓ డేటాబేస్ రూపొందించడానికి సాంకేతిక నిపుణులను కూడా నియమించుకుంటున్నారు.
వలస ఓటర్ల ఓటింగ్ అభ్యర్థుల గెలుపును ప్రభావితం చేసే వీలు ఉందంటూ రాజకీయ విశ్లేషకులు కూడా చెబుతున్నారు. దీంతో పోటాపోటీ ఎన్నికలు జరిగే స్థానాల్లో తమకు అనుకూలంగా ఉన్న ఏ ఒక్క ఓటును కూడా విడిచిపెట్టకూడదని ప్రధాన పార్టీల అభ్యర్థులు అనుకుంటున్నారు. దీనికోసం ఇప్పటికే దూర ప్రాంతాల నుంచి వారిని రప్పించడానికి ప్రయత్నాలను ముమ్మరం చేశారు. వీరిని తమ తమ గ్రామాలకు రప్పించుకోవడం కోసం.. ప్రతీ పది మందికి ఓ సమన్వయకర్తను నియమించారు. దీనికోసం సంబంధిత గ్రామాల్లో కార్యకర్తలకు ఈ బాధ్యతలను ఇప్పటికే అప్పగించేశారు.
ముఖ్యంగా ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని మునుగోడు, దేవరకొండ, భువనగిరి, ఆలేరు, తుంగతుర్తి, నాగార్జునసాగర్ నియోజకవర్గాల్లో దాదాపు 2 లక్షల మంది ఓటర్లు బతుకు తెరువు కోసం వలస వెళ్లినట్లు గుర్తించారు. ఒక్క మునుగోడు నియోజకవర్గంలోనే సుమారు 40 వేలమందికి పైగా వలస ఓటర్లు ఉన్నట్లు లెక్క తేలింది. వీళ్లంతా హైదరాబాద్, భీవండి, ముంబై, సూరత్, షోలాపూర్ వంటి ప్రాంతాలలో వివిధ పనులు చేస్తూ జీవనం గడుపుతున్నారు.
దేవరకొండ నియోజకవర్గంలో అయితే దాదాపు 25 వేల మంది వరకూ వలస ఓటర్లు ఉన్నారు. వీళ్లంతా హైదరాబాద్, మాచర్ల, విజయవాడ, విశాఖపట్నం వంటి ప్రాంతాల్లో ఉపాధి కోసం వెళ్లినట్లు గుర్తించారు. అలాగే భువనగిరి, ఆలేరు నియోజకవర్గంలో సుమారు 20 వేల మంది, తుంగతుర్తి, సాగర్, సూర్యాపేటల్లో పదివేలకు తక్కువ కాకుండా ఈ వలస ఓటర్లు ఉంటారని లెక్క తేల్చారు.
ఇక ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో వెనుకబడిన ప్రాంతంగా చెప్పుకునే ఓ నియోజకవర్గంలో 18 వేల వలస ఓటర్లు ఉన్నారు. ముంబై, సోలాపూర్,పూనేలో వివిధ పనులు చేసుకునే ఈ వలస ఓటర్ల కోసం సామాజిక వర్గాల వారిగా కొంతమందిని బృందంగా ఏర్పాటు చేసి, వారిని పోలింగ్ కోసం తెలంగాణకు రప్పించే ప్రయత్నం చేస్తున్నారు.కొన్ని చోట్ల రేషన్ డీలర్ సాయం కూడా తీసుకుంటున్నారు. పాలమూరు నియోజకవర్గంలోని 2 మండలాల పరిధిలో 6 వేలమంది వలస ఓటర్లున్నారు.
అలాగే నారాయణపేట, కొడంగల్, వనపర్తి నియోజకవర్గాల్లో సుమారు 15 వేలకు పైగా వలస ఓటర్లు ఉంటారు. మహబూబ్ నగర్, దేవరకద్ర, అచ్చంపేట, మక్తల్, నాగర్ కర్నూల్ నియోజకవర్గాల్లో దాదాపు 10 వేల ఓట్లరు ఉన్నారు. నారాయణపేట నియోజకవర్గంలోని నారాయణపేట, కోయిల కొండ, ధన్వాడ ప్రాంతాలకు చెందిన వలస కార్మికులు ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు. కొడంగల్ నియోజకవర్గంలోని మద్దూరు, బొంరాస్పేట , కోస్గి మండలాలలో చాలామంది ఇతర రాష్ట్రాల్లో స్థిరపడ్డారు. మహబూబ్నగర్ జిల్లాలోని గండీడ్ , హన్వాడ, మహ్మదాబాద్ మండలాలకు చెందిన తండాలకు చెందినవారిలో కూడా వలస కార్మికులు భారీగా ఉన్నారు. వీరందరినీ ఎలా అయినా తమ తమ గ్రామాలకు రప్పించి ప్రలోభపెట్టి అయినా తమకు ఓటు వేయాలని నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. కనీసం ఎన్నికలకు రెండు రోజుల ముందే వీరందరినీ గ్రామాలకు రప్పించాలని భావిస్తున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE