ఇప్పటి వరకూ ఒక లెక్క.. ఇక నుంచి మరో లెక్క అన్నట్లుగా పాతబస్తీ రాజకీయాలు మారిపోయాయి. ఎందుకంటే పాతబస్తీ రాజకీయాలను శాసించే మజ్లిస్కు ఈసారి ఎంబీటీ పోరు తప్పడం లేదు. యాకుత్పురా అసెంబ్లీ స్థానంలోనే మజ్లిస్కు తీవ్రమైన పోటీనిస్తూ ఎంబీటీ కొరకరాని కొయ్యగా మారిపోయింది.
ఈసారి మజ్లిస్ పాతబస్తీకే పరిమితమై.. కేవలం తొమ్మిది స్థానాల్లోనే పోటీలో దిగినప్పటికీ.. ఒక సిట్టింగ్ స్థానంలో ఎంబీటీ, మరో రెండు సిట్టింగ్ స్థానాల్లో కాంగ్రెస్ దూకుడు ఇప్పుడు మజ్లిస్ను టెన్షన్ పెడుతోంది. దీంతో ఇంతకు ముందెప్పుడూ లేని విధంగా మజ్లిస్కు గడ్డు పరిస్థితి నెలకొన్నట్లు అయింది. మజ్లిస్ పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ.. సిట్టింగ్ స్థానాలపై ప్రత్యేక దృష్టి సారిస్తూ.. పాదయాత్ర, స్థానిక సభలతో పరిస్థితి చక్కదిద్దడానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నా..అవి ఎంత వరకూ ఫలిస్తాయో విశ్లేషకులు కూడా అంచనా వేయలేకపోతున్నారు.
మజ్లిస్- బచావో- తహరిక్ (ఎంబీటీ) వ్యూహాత్మక దూకుడుతో మజ్లిస్కు యాకుత్పురా సిట్టింగ్ స్థానం చేజారేలా పరిస్థితులు కనిపిస్తున్నాయి. . మజ్లిస్ అభ్యర్థిగా నాంపల్లి సిట్టింగ్ ఎమ్మెల్యే జాఫర్ హుస్సేన్ నిలబడగా, ఎంబీటీ అభ్యర్థిగా ఆ పార్టీ అధికార ప్రతినిధి అమ్జదుల్లాఖాన్ పోటీకి దిగారు. అక్కడ కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులు రంగంలో ఉన్నా కూడా పోటీ మాత్రం ఈ ఇద్దరి మధ్యే నెలకొన్న పరిస్థితి కనిపిస్తోంది. యాకుత్పురా సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన అహ్మద్ పాషాకు రిటైర్మెంట్ ప్రకటించిన మజ్లిస్.. నాంపల్లి సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన జాఫర్ హుస్సేన్ అభ్యర్థిత్వాన్ని యాకుత్పురాకు ట్రాన్స్ఫర్ చేసి అక్కడ రంగంలోకి దింపింది.
రెండు దశాబ్దాలుగా యాకుత్పురా స్థానాన్ని కైవసం చేసుకోవడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్న ఎంబీటీ.. ఈసారి ఎన్నికలను మాత్రం కాస్త ప్రతిష్టాత్మకంగానే తీసుకుంది. నిజానికి మజ్లిస్ నుంచి చీలిన మజ్లిస్- బచావో- తహరిక్ గతంలో యాకుత్పురా స్థానాన్ని కై వసం చేసుకుంది. ఎంబీటీ నుంచి ఎన్నికై న ముంతాజ్ ఖాన్ ఆ తర్వాత ..మజ్లిస్లో చేరి వరసగా గెలుస్తూ వచ్చారు. 2018 ఎన్నికలలో చార్మినార్ నుంచి పోటీ చేసిన ముంతాజ్ ఖాన్ తాజాగా రిటైర్మెంట్ తీసుకున్నారు. ఇటు తన పూర్వవైభవం కోసం యాకుత్పురాపై సీరియస్గా దృష్టి సారించిన ఎంబీటీ ఈసారి ఎలాగైనా పాగా వేసేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తూ వస్తోంది.
అలాగే మజ్లిస్ సిట్టింగ్ స్థానమైన నాంపల్లిలో పరిస్థితి కూడా నువ్వా నేనా? అన్నట్లుగానే తయారైంది. మజ్లిస్ వ్యూహత్మంగా సిట్టింగ్ ఎమ్మెల్యేను పక్క నియోజకవర్గానికి పంపించి..నాంపల్లి నుంచి మాజీ మేయర్ మాజీద్ హుస్సేన్ను రంగంలోకి దింపింది.అయితే ఇదే స్థానం నుంచి మూడు దఫాలుగా పోటీ పడుతున్న ఫిరోజ్ ఖాన్.. కాంగ్రెస్ అభ్యర్థిగా రంగంలో ఉండటంతో పోటీ గట్టిగానే ఉంది. కాంగ్రెస్ దూకుడు మజ్లిస్కు ఆందోళన కలిగిస్తోంది.
ఒకవైపు కాంగ్రెస్ , మరోవైపు ఫిరోజ్ ఖాన్కు వ్యక్తిగత ప్రాబల్యం వల్ల నాంపల్లిలో మజ్లిస్ ఓట్లకు గండికొట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంతేకాదు మలక్పేట అసెంబ్లీ నియోజకవర్గంలో కూడా కాంగ్రెస్ మరింత బలపడిన పరిస్థితులు ఉన్నాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారి అక్బర్ తన ప్రచారాన్ని ఉద్ధృతం చేయడంతో మజ్లిస్ కలవర పడుతోంది. దీంతో ఎప్పటినుంచో మజ్లిస్ నియోజకవర్గాలుగా గుర్తింపు బడ్డ చోట్ల గట్టి పోటీ ఎదురవడంతో.. ఈ సారి అక్కడి పరిస్థితిని రాజకీయ విశ్లేషకులు కూడా అంచనా వేయలేకపోతున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE