మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కాంగ్రెస్లోకి వచ్చీ రాగానే నియోజకవర్గంలో చక్రం తిప్పారు. ప్రజల కోసం తలనరుక్కుంటా కానీ.. తలవంచను.. వంటి భారీ డైలాగులతో రాజకీయాలను వేడెక్కించారు. కొందరు కీలక నేతలను తన వైపు తిప్పుకోగలిగారు. అసలే సీనియర్ నాయకులు.. అందులోనూ ఖమ్మంతో సత్సంబంధాలు ఉన్న నేత కావడంతో.. అప్పటి వరకూ ప్రజల్లో ఉన్న ప్రత్యర్థి పార్టీ నాయకుడి హవా కాస్త తగ్గించి తుమ్మల పై చేయి దిశగా ముందుకు సాగారు. కానీ.. ప్రచారం మొదలయ్యాక పరిస్థితి మారింది. బీఆర్ఎస్ అభ్యర్థి పువ్వాడ అజయ్ తనదైన శైలిలో ప్రచారం సాగిస్తూ.. తుమ్మల నాగేశ్వరరావు మించి వ్యూహాలు పన్నడం మొదలుపెట్టారు. ఖమ్మం.. మళ్లీ కారుదే అనేలా పరిస్థితిని మార్చేశారు.
రాష్ట్రంలోని కామారెడ్డి, గజ్వేల్ తర్వాత.. ఖమ్మం నియోజకవర్గం ఈ ఎన్నికల్లో హాట్ టాపిక్ గా మారింది. బీఆర్ ఎస్ పై అలిగి హస్తం గూటికి చేరిన తుమ్మల నాగేశ్వరావు.. జిల్లాలో కారు స్పీడుకు బ్రేకులు వేయాలని సంకల్పించారు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో కలిసి తీవ్రంగా కసరత్తు చేస్తున్నారు. ప్రధానంగా తాను పోటీ చేస్తున్న ఖమ్మంలో ఎలాగైనా కాంగ్రెస్ జెండా ఎగరవేయాలని శ్రమిస్తున్నారు. అనుకున్నట్లుగానే మొదట్లో దూకుడుగానే వెళ్లారు. దీంతో బీఆర్ ఎస్ అభ్యర్థి, మంత్రి పువ్వాడ వెంటనే అప్రమత్తమయ్యారు. గత రెండు పర్యాయాలుగా నియోజకవర్గంలో ప్రాతినిధ్యం వహిస్తున్న అజయ్ తాను చేపట్టిన అభివృద్ధే ఎజెంగా ప్రజల్లో విస్తృతంగా పర్యటించారు. 2014లో జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం తరపున పోటీ చేసిన తుమ్మలపై విజయం సాధించిన పువ్వాడ కు ఆయన బలాబలాలపై పూర్తి అవగాహన ఉంది. దీంతో మరోసారి తుమ్మల ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ ప్రజలను ఆకట్టుకుంటున్నారు.
ఖమ్మం నియోజకవర్గంలో మూడు లక్షల మందికి పైగా ఓటర్లు ఉన్నారు. నియోజకవర్గంలో ముస్లిం, మైనార్టీల ఓట్లు 40 వేలకు పైనే ఉన్నాయి. గెలుపోటములపై వీరి ఓట్లు ప్రభావం చూపనున్నాయి. ప్రస్తుతానికి మైనార్టీల చూపు బీఆర్ ఎస్ వైపే ఉన్నట్లు తెలుస్తోంది. దీనికి తోడు.. అజయ్ ఆధ్వర్యంలో ఖమ్మం పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందింది. నగరపాలక సంస్థ లో ప్రజలకు మౌలిక వసతుల కల్పన కోసం రూ. 2వేల కోట్లు వెచ్చించారు. . 4 కోట్లతో లకారం చెరువును సుందరీకరించారు. రూ. 100 కోట్లతో గోళ్లపాడు చానల్, రూ. 23 కోట్లతో నూతన మున్సిపల్ కార్పొరేషన్ భవనాలను నిర్మించారు.
మిషన్ భగీరథ అమృత్ పథకంలో భాగగా రూ. 229 కోట్లతో మంచినీటి సరఫరా పనులు పూర్తయ్యాయి. ఇంటింటికీ నల్లా పథకంలో 84 వేల గృహాలకు నల్లాలు, 21,946 ఎల్ఈడీ వీధి దీపాలను ఏర్పాటు చేశారు. రూ. 70 కోట్లతో ధంసలాపురం ఆర్వోవీ బ్రిడ్జిని నిర్మించారు. ముస్తాఫానగర్ నుంచి ధంసలాపురం గేటు వరకు నాలుగు లైన్ల రహదారి నిర్మాణ పనులు పూర్తి చేశారు. ఖమ్మం నగరంలోని నిరుపేదలకు టేకులపల్లి వద్ద 1,210 డబుల్ బెడ్రూమ్ ఇండ్లను నిర్మించారు. వాడవాడలా సీసీ రోడ్లు, సైడు కాల్వలు, కూరగాయల మార్కెట్లు, వైకుంఠధామాల నిర్మాణాలు చేశారు. జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణకు పోలీస్ కమిషనరేట్ను ఏర్పాటు చేశారు. ప్రజావసరాలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చేందుకు రూ. 10 కోట్లతో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని నిర్మించారు. ఖమ్మం నగరంలో పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ఎన్నెస్పీ క్యాంపులో రూ.25 కోట్లతో నూతన బస్స్టాండ్ ను నిర్మించారు.
అంతేకాకుండా సాంకేతిక విద్యను అభ్యసిస్తూ ఉద్యోగ వేటలో సుదూర ప్రాంతాలకు తరలివెళుతున్న ఖమ్మం యువత కోసం మంత్రి పువ్వాడ అజయ్కుమార్ ‘ఐటీహబ్’ను తీసుకువచ్చారు. రూ. 25 కోట్లతో మొదటి దశ నిర్మాణం పూర్తయ్యింది. దాన్ని ప్రారంభించిన మంత్రి కేటీఆర్ రెండో దశ నిర్మాణానికి రూ.36 కోట్లు మంజూరు చేయించారు. నియోజకవర్గంలో ఏకంగా 1100 మంది దళితులకు రూ. 10 లక్షల చొప్పున దళితబంధు అందజేశారు. నియోజకవర్గంలోని బీసీలకు 300 మందికి లక్ష చొప్పున రుణాలను అందజేశారు. విడతల వారీగా బీసీలందరికీ రుణాలు అందించేలా ప్రభుత్వం ప్రణాళికను రూపొందించారు.
చేసిన అభివృద్ధి, చేయబోయే అభివృద్ధి ప్రణాళికలతో నియోజకవర్గ ప్రజలకు పువ్వాడ చేరువయ్యారు. దీంతో పాటు పోల్ మేనేజ్ మెంట్ పై దృష్టి సారించారు. కొన్ని టీమ్లను రంగంలోకి దించి బీఆర్ ఎస్ చేసిన అభివృద్ధి ఫలాలను ఇంటింటికీ వివరించడంలో పువ్వాడ సక్సెస్ అయ్యారు. దీంతో మంత్రి తుమ్మలకు ఎదురీత తప్పడం లేదు. పరువు, ప్రాభవం కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు. పువ్వాడVs తుమ్మల గా సాగుతున్న ఖమ్మం గుమ్మంలో ఎవరి జెండా ఎగరనుందో వేచి చూడాలి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE