తెలంగాణ రాష్ట్రంలో వచ్చే ఎన్నికల్లో గెలుపు అవకాశాలపై ఇప్పటినుంచే పలువురు నాయకులు అంచనాలు వేస్తున్నారు. ఎక్కడెక్కడ ఎవరు గెలుస్తారు? ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది? అని వ్యక్తిగతంగా సర్వేలు చేయిస్తున్నారు. ఈ క్రమంలో రాష్ట్ర పంచాయితీరాజ్ మరియు గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు రానున్న ఎన్నికలకు సంబంధించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అయితే ఆయన తమ సొంత పార్టీ బీఆర్ఎస్ మరియు ఎమ్మెల్యేలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఖమ్మంలో రేపు జరుగనున్న బీఆర్ఎస్ ఆవిర్భావ సభ నేపథ్యంలో మహబూబాబాద్ పట్టణంలో మంగళవారం పార్టీ కార్యకర్తలతో సన్నాహక సమావేశం ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ పైన ప్రజలకు నమ్మకం ఉందని, అయితే పార్టీలోని దాదాపు 20 మంది ఎమ్మెల్యేలపై కొంత వ్యతిరేకత ఉందని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో ఆ ఎమ్మెల్యేలను మారిస్తే బీఆర్ఎస్ పార్టీ 100 సీట్లు పక్కాగా గెలుచుకుంటుందని, లేదంటే 90 సీట్ల లోపే పరిమితం అవుతుందని పేర్కొన్నారు. ఇక తాను సర్వేలు చేయించడం ఇదే తొలిసారి కాదని, అలాగే తన సర్వే ఎప్పుడూ తప్పు కాలేదని స్ఫష్టం చేశారు. 20-25 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీతో, ఇంకో 15-20 స్థానాల్లో బీజేపీతో హోరాహోరీ పోరు ఉంటుందని ఆయన అంచనా వేశారు. కాగా ఇప్పటికే సీఎం కేసీఆర్ వచ్చే ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలకు మళ్లీ సీట్లు ఇస్తానని ఎమ్మెల్యేల సమావేశంలో ప్రకటించడం తెలిసిందే. ఈ నేపథ్యంలో మంత్రి ఎర్రబెల్లి చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికరంగా మారాయి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE