తెలంగాణాలో రైతాంగం కోసం బీజేపీ, టీఆర్ఎస్ ప్రభుత్వాలు చేసిన పనులపై చర్చకు సిద్ధం అని మంత్రి ఎర్రబెల్లి పేర్కొన్నారు. బీజేపీ తెలంగాణ రాష్ట్రానికి ఏం చేసిందో చెప్పాలని ఎర్రబెల్లి ప్రశ్నించారు. ధాన్యం సేకరణ విషయంలో కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ.. టీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో దయాకర్ రావు మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా.. తెలంగాణ ప్రజలను కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ అవమానించే రీతిలో మాట్లాడారని, దీనిని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. కేంద్రంలోని బీజేపీ పెద్దలు తెలంగాణ రైతాంగాన్ని అవమానపరుస్తుంటే, రాష్ట్రం లోని బీజేపీ నాయకులు కనీసం స్పందించడం లేదని మండిపడ్డారు. తెలంగాణ నుంచి నలుగురు బీజేపీ ఎంపీలు ఉన్నారని, కానీ వారు రాష్ట్రానికి మేలు జరిగేలా ఎలాంటి ప్రయత్నాలు చేయటం లేదని వ్యాఖ్యానించారు.
రాష్ట్రంలో వ్యవసాయరంగానికి చేయూతనిచ్చింది, రైతు సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టింది ఒక్క సీఎం కేసీఆరేనని, అందుకే ఇప్పుడు చదువుకున్నవారు, ఉద్యోగులు కూడా వ్యవసాయం వైపు మొగ్గు చూపుతున్నారని వెల్లడించారు. తెలంగాణాలో వడ్లు కొంటామని చెప్పి రైతులతో వరి వేయించారని, ఇప్పుడు మాత్రం మేం ముడి బియ్యమే కొంటామని కేంద్రం చెబుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. యాసంగిలో ముడి బియ్యం ఎలా వస్తాయని ప్రశ్నించారు. వ్యవసాయ చట్టాలపై దేశంలోని ఇతర రాష్ట్రాల రైతులు ఏకమయ్యారని, ఇప్పుడు కూడా అలాగే తెలంగాణ రైతాంగం అంతా ఏకమై కేంద్రం నిర్ణయం మార్చుకునేలా చేస్తుందని పేర్కొన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఇంకా ఇతర ముఖ్య నాయకులు పాల్గొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ