గాంధీ ఆసుపత్రి వైద్యులు ప్రాణాలకు తెగించి కరోనా రోగులకు వైద్యం చేస్తున్నారని, వాళ్ళపై ఆరోపణలు చేయటం సరికాదని తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. కరోనాతో చనిపోతే అంత్యక్రియలు చెయ్యటానికి భయపడుతున్నారు, ప్రజల మేలు కోసమే ప్రభుత్వం పని చేస్తోంది. కరోనా కేసుల విషయంలో కానీ, కరోనా మరణాల విషయంలో కానీ ప్రభుత్వం ఎటువంటి దాపరికం లేకుండా ప్రకటన చేస్తోందని మంత్రి ఈటల రాజేందర్ చెప్పారు. కరోనా పాజిటివ్ తో మొదట్లో ఎవరన్నా చనిపోతే వారి కుటుంబ సభ్యులు సైతం చూడడానికి దగ్గరికి రాలేదు. దహన సంస్కారాలు చేయడానికి ముందుకు రాలేదు. అమెరికా, ఇటలీ లాంటి దేశాలలో వందలమంది చనిపోతే కుటుంబ సభ్యులు లేకపోతే ప్రభుత్వాలే అంత్యక్రియలు చేశాయని మంత్రి ఈటల అన్నారు.
ఏప్రిల్ 29 వ తేదీన వనస్థలిపురం నుండి ఈశ్వరయ్య అనే పేషంట్ కరోనా పాజిటివ్ తో గాంధీ ఆసుపత్రిలో చేరారు. ఇరవై నాలుగు గంటల లోపే 30 వ తేదీన చనిపోయారు. దీనితో ఆయన కుటుంబ సభ్యులందరికీ పరీక్షలు చేశాం. ఈశ్వరయ్య కొడుకు మధుసూదన్ తీవ్రమైన శ్వాస సంబంధమైన ఇబ్బందితో గాంధీకి వచ్చారు. ఆయన 1వ తేదీన చనిపోయారు. అప్పటికే ఆయన భార్యతో సహా కుటుంబసభ్యులు అందరూ క్వారంటైన్ లో ఉన్నారు. భార్యకి చెప్తే షాక్ కి గురవుతుందని, గంబీరమైన సందర్భంలో చెప్పకుండా ఉండడమే మేలని చుట్టాలు చెప్పిన నేపద్యంలో మృతదేహాన్ని పోలీసులకు అప్పగించి జీహెచ్ఎంసీ ద్వారా దహన సంస్కారాలు నిర్వహించారని మంత్రి వివరించారు. బంధువులకు చెప్పకుండా కరోనా వచ్చిన మధుసూదన్ ను ప్రభుత్వం అంత్యక్రియలు నిర్వహించిందని వస్తున్న ఆరోపణలను మంత్రి ఖండించారు. కోలుకుని బయటకి వచ్చాక గాంధీ ఆస్పత్రిపై ఆరోపణలు చేయడం సరికాదు మంత్రి ఈటల అన్నారు.
కరోనా పరీక్షల్లో భాగంగా రాపిడ్ కిట్స్ మీద నమ్మకంలేదని మొదటి నుండి చెప్తున్నాము. ఇప్పుడు ఐసీఎంఆర్ కూడా అదే చెప్పిందని మంత్రి అన్నారు. అలాగే కోవిడ్ పరీక్షలు, చికిత్స ప్రభుత్వ రంగంలోనే అందిచాలని ఆ సామర్ధ్యం మనకి ఉందని సీఎం కేసీఆర్ చెప్తూ వస్తున్నారు. సీఎం ఆదేశాల మేరకు పరీక్షలు, చికిత్సలను అందిస్తున్నామని మంత్రి అన్నారు. ఒక వ్యక్తికి పాజిటివ్ అని తేలితే వారి కుటుంబ సభ్యులు, పాజిటివ్ వ్యక్తి కలిసిన వారందరినీ ట్రేస్ చేసి తీసుకువచ్చి పరీక్షలు చేయిస్తున్నాం. అవసరం అయితే క్వారంటైన్ చేస్తున్నాము. ఇవన్నీ ప్రైవేట్ వ్యక్తులు చేయగలరా అని మంత్రి అన్నారు. వైద్య ఆరోగ్య శాఖ, పంచాయతీరాజ్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, పోలీస్, రెవెన్యూ యంత్రాంగాలు అన్నీ కలిసి పనిచేస్తేనే ఇది సాధ్యం అవుతున్న నేపద్యంలో కోర్టు ఇచ్చిన ఆదేశాలను సమీక్షించుకుని తదుపరి చర్యలు తీసుకుంటామని మంత్రి ఈటల రాజేందర్ తెలియజేశారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu