తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారికి అడ్డుకట్ట వేయడానికి, చికిత్స అందించడానికి అన్ని సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. కరోనా పాజిటివ్ వచ్చిన వారికి ఊపిరి తిత్తుల మీద ప్రభావం ఎక్కువగా పడుతుంది. అత్యవసర పరిస్థితుల్లో శ్వాస సంబంధ సమస్యలు తలెత్తుతాయి. ఇలాంటి పేషెంట్ లకు వెంటిలేటర్స్ సహాయం అవసరం. అందుకోసమే ఎక్కువ వెంటిలేటర్స్ సమకూర్చుకునే ప్రయత్నం చేస్తున్నాం. మా విజ్ఞప్తిని మన్నించి వెంటిలేటర్స్ తయారు చేసి ఇవ్వడానికి ముందుకు వచ్చిన డీఆర్డీఓ కు ధన్యవాదములు. వివిధ హాస్పిటల్స్ లో చిన్న చిన్న సమస్యలతో పక్కన పడేసిన వెంటిలేటర్స్ ని కూడా ఇప్పటికే రిపేర్ చేయించి వినియోగిస్తున్నాము. అదే విధంగా కొత్త వెంటిలేటర్స్ కోసం కూడా ఆర్డర్ ఇచ్చామని మంత్రి తెలిపారు.
అదేవిధంగా 1000 వెంటిలేటర్స్ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని, కేంద్ర మంత్రి హర్షవర్ధన్ ని కోరామని మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. ఈ రోజు బిఆర్కే భవన్ లో అమెరికన్ ఇండియా ఫౌండేషన్, గ్రేస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మైక్రాన్ సంస్థ 100 వెంటిలేటర్స్ ను మంత్రి ఈటల రాజేందర్ కి అందించారు. 80 వెంటిలేటర్స్ గాంధీ ఆసుపత్రి కి, 10 ఉస్మానియా ఆసుపత్రికి, 10 చెస్ట్ హాస్పిటల్ కి అందించారు. మరో 100 వెంటిలేటర్స్ కూడా అందిస్తామని గ్రేస్ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ చిన్నబాబు తెలిపారు. వీటితో పాటు 5000 పీపీఈ కిట్స్, 5000 ఎన్-95 మాస్క్ లు కూడా అందించారు. ఈ కార్యక్రమంలో మైక్రాన్ డైరెక్టర్ రాధిక, మేనేజర్ మురళి, అమెరికన్ ఇండియా ఫౌండేషన్ స్టేట్ ప్రోగ్రామ్ మేనేజర్ వినయ్ సనం, గ్రేస్ ఫౌండేషన్ చైర్మన్ డా.చినబాబు , కిరణ్ మరియు గాంధీ ఆసుపత్రి సూపింటెండెంట్ డాక్టర్ రాజారావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వీరికి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu