తెలంగాణలో అమలవుతున్న ఉచిత సంక్షేమ పథకాలు రద్దు చేయాలని బీజేపీ కోరుతోందని మండిపడ్డారు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి మంత్రి తన్నీరు హరీష్ రావు. మంగళవారం ఆయన సిద్దిపేట నియోజకవర్గ పరిధిలోని కొండపాక మండలంలో నూతనంగా ఎంపిక చేసిన లబ్ధిదారులకు ఆసరా పింఛన్ కార్డులను పంపిణీ చేశారు. దీనితో పాటుగా మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. జప్తి నాచారంలో ఎసీ, గౌడ సంఘం భవనాల కోసం రూ.50 లక్షలు మంజూరు చేశారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. ఒకప్పుడు ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు తెలంగాణ ప్రాంతం ఎడారిగా ఉండేదని, కరువు ప్రాంతంగా భావించేవారని గుర్తు చేశారు. బ్రతుకుదెరువుకి పక్క రాష్ట్రాలకు, ఇతర దేశాలకు వెళ్లేవారని, ప్రస్తుతం రాష్ట్రంలో పరిస్థితులు మారాయని మంత్రి హరీష్ అన్నారు.
కొట్లాడి తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నామని, అలాగే సాధించుకున్న రాష్ట్రాన్ని గాడిలో పెట్టుకుంటున్నామని హరీష్ రావు తెలిపారు. ప్రతిపక్షాలు ఎన్ని కుట్రలు చేసినా పట్టు వదలకుండా సీఎం కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించడం ద్వారా తెలంగాణ లోని అత్యధిక ప్రాంతాన్ని సస్యశ్యామలంగా మార్చారని వెల్లడించారు. దేశంలో మరే రాష్ట్రంలో కూడా తెలంగాణ మాదిరిగా 24 గంటల ఉచిత విద్యుత్ అందించడం లేదని, మనం సాధించిన ప్రగతికి ఇదే నిదర్శనమని మంత్రి అన్నారు. 24 గంటల ఉచిత విద్యుత్ వలన రాష్ట్రంలో ఏడాదికి రెండు సార్లు వరి పంట సాగు అవుతోందని, నేడు దేశానికి అన్నం పెట్టే స్థాయికి తెలంగాణ అభివృద్ధి చెందిందని హరీష్ తెలియజేశారు. తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడా అమలు చేయలేకపోతున్నారని, అలాంటి వారు మన దగ్గర అమలవుతున్న ఉచిత సంక్షేమ పథకాలను రద్దు చేయాలని కోరుతున్నారని మంత్రి హరీష్ రావు ఎద్దేవా చేశారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY