మెదక్ జిల్లాకు కాళేశ్వరం ప్రాజెక్టు నీళ్లు మరి కొద్ది రోజుల్లోనే రానున్నాయని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్రావు పేర్కొన్నారు. ఈ రోజు జిల్లాలోని హవెలి ఘన్పూర్ మండలం సర్దన గ్రామంలో మంజీరా నదిపై చెక్ డ్యామ్ నిర్మాణానికి మంత్రి హరీష్రావు శంకుస్థాపన చేశారు. రూ.12.50 కోట్లతో మంజీర నదిపై నిర్మించనున్న ఈ చెక్ డ్యామ్ ఐదు గ్రామాలకు ఉపయోగపడుతుందని చెప్పారు. లబ్ది పొందే 3 గ్రామాలు పాపన్నపేట మండలంలో, రెండు గ్రామాలు ఘన్పూర్ మండలంలో ఉన్నాయని, మొత్తం 2 వేల ఎకరాల ఆయకట్టుకు నీరు వస్తుందని చెప్పారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మంజీరాపై ఒక్క చెక్ డ్యామ్ మంజూరు చేయలేదు. కాంగ్రెస్, టీడీపీ ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చాయి, పోయాయి కాని చెక్ డ్యామ్ మంజూరు చేయలేదని మంత్రి హరీష్ రావు చెప్పారు. కుట్రతోనే సమైక్య వాదులు చెక్ డ్యామ్ లు కట్టనివ్వలేదని అన్నారు. తెలంగాణ వచ్చాక టిఆర్ఎస్ ప్రభుత్వం మంజీరా నదిపై దాదాపు 15 చెక్ డ్యామ్ లు మంజూరు చేసిందని, ఈ ఘనత సీఎం కేసీఆర్ కు, టిఆర్ఎస్ పార్టీకి దక్కుతుందన్నారు.
సంగారెడ్డి జిల్లాలో ఫసల్వాది గ్రామం నుంచి చివర సర్దేన వరకు మంజీరాపై 15 చెక్ డ్యామ్ లు మంజూరు చేయించి, వేగంగా నిర్మాణ పనులు చేపట్టామని మంత్రి తెలిపారు. ఈ 15 చెక్ డ్యామ్ ల ద్వారా 25 వేల ఎకరాలకు సాగు నీరు, మంజీరాకు ఇరువైపులా రైతు బావులు, బోర్లలో ఊట పెరిగి, భూగర్భజలాలు పెరుగుతాయని అన్నారు. రూ.1200 కోట్ల నాబార్డు నిధులతో యుద్ధప్రాతిపదికన చెక్ డ్యామ్ లు నిర్మాణం జరుగుతుందన్నారు. ఈ సందర్భంగా కాళేశ్వరం ప్రాజెక్టు తొలి ఫలితం మరికొద్ది రోజుల్లో మెదక్ జిల్లా అందుకోబోతుందని చెప్పారు. కొండ పోచమ్మ సాగర్ కు నీరు వచ్చిన వెంటనే హల్దీ ద్వారా బొల్లారం మత్తడికి వస్తాయని, అక్కడి నుంచి సర్దన చెక్క డ్యాం, కూచన పల్లి చెక్ డ్యాంకు కాళేశ్వరం నుంచి నీళ్లు వస్తాయన్నారు. బొల్లారం మత్తిడి కింద దాదాపు 13 వేల ఎకరాల ఆయకట్టుకు కాళేశ్వరం ద్వారా నీరు ఇవ్వవచ్చని మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu