కరోనా ప్రభావం తగ్గింది, కానీ వైరస్ ప్రమాదం ఇంకా పొంచే ఉందని తెలంగాణ రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ తీసుకోవాలని, ఈ విషయంలో ప్రజలందరూ ప్రభుత్వానికి సహకరించాలని హరీష్ రావు విజ్ఞప్తి చేశారు. బుధవారం ఖైరతాబాద్ నియోజకవర్గ పరిధిలోని వెల్నెస్ సెంటర్లో వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని మరియు 50 పడకల సీహెచ్సీ ఆస్పత్రిని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘నేషనల్ వ్యాక్సినేషన్ డే’ సందర్భంగా 12 నుంచి 14 ఏళ్ల లోపు పిల్లలకు వ్యాక్సినేషన్ అందించడం సంతోషంగా ఉందని అన్నారు. కరోనా ప్రభావం తగ్గింది తప్ప వైరస్ ప్రమాదం ఇంకా పొంచే ఉందన్నారు. దీనికి నిదర్శనమే చైనా, అమెరికా, హాంకాంగ్లో కొత్త కరోనా కేసులు నమోదు కావడం అని తెలిపారు. కరోనా కేసులపై ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా హెచ్చరిస్తోందని చెప్పారు.
ఈమధ్య వచ్చిన థర్డ్ వేవ్లో కరోనా ప్రభావం చూపలేదని, ఇకపై టీకా అవసరం లేదనే నిర్లక్ష్య ధోరణి పెట్టుకోవద్దు, అందరూ జాగ్రత్తగా ఉండాలని మంత్రి హరీష్ రావు సూచించారు. ఈరోజు ప్రపంచం మొత్తం కొత్త వ్యాక్సిన్ కోసం హైదరాబాద్ వైపు చూస్తోందని పేర్కొన్నారు. ఇప్పటివరకు మనకు దేశీయంగా 3 వ్యాక్సిన్స్ తయారైతే.. వాటిలో 2 మన హైదరాబాద్ లోనే తయారయ్యాయని, ఇది మనకు గర్వకారణం అని మంత్రి తెలిపారు. ఆ రెండు.. భారత్ బయోటెక్ నుంచి వచ్చిన కొవాగ్జిన్, బయోలాజిక్ సంస్థ నుంచి వచ్చిన కొర్బెవాక్స్ అని వెల్లడించారు. అలాగే రాష్ట్రంలో ఫస్ట్ డోస్ వ్యాక్సినేషన్ 106 శాతం పూర్తి చేసుకున్నామని, సెకండ్ డోస్ వ్యాక్సినేషన్ 97 శాతం పూర్తి చేసుకున్నామని తెలియజేశారు. 12 -14 ఏండ్ల లోపు పిల్లలు మైనర్లు కాబట్టి.. తల్లిదండ్రులు చొరవ చూపి వ్యాక్సిన్ వేయించాల్సిందిగా సూచించారు. కేంద్రం అనుమతి ఇచ్చిన నేపథ్యంలో ఈ రోజు నుంచి రాష్ట్రంలో 60 ఏండ్లు దాటిన వారందరికీ బూస్టర్ డోసు ఇస్తామన్నారు మంత్రి హరీష్ రావు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ