అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా సచివాలయంలో ఆయన చిత్రపటానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు. పొట్టి శ్రీరాములు జీవితం ఎందరికో ఆదర్శమని సీఎం జగన్ కొనియాడారు. ఆ మహానుభావుడి వల్లనే మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పాటయిందని, ఆయన త్యాగం వెలకట్టలేనిదని సీఎం పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్, దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. అలాగే తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో కూడా పొట్టి శ్రీ రాములు జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మరోవైపు పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా.. మంగళగిరి డీజీపీ కార్యాలయంలో డీజీపీ కేవీ రాజేంద్రనాథ్ రెడ్డి, ఇతర ఉన్నధికారులు శ్రీరాములు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
పొట్టి శ్రీరాములు 1901 మార్చి 16న గురవయ్య, మహాలక్ష్మమ్మ దంపతులకు జన్మించారు. స్వాతంత్ర్యోద్యమంలో చురుకైన పాత్ర పోషించారు. గాంధీ మహాత్ముడి అడుగుజాడలలో పలు ఉద్యమాలలో పాల్గొని జైలుకు కూడా వెళ్లారు. స్వాతంత్ర్యానంతరం ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర సాధన కొరకు మద్రాసులో 1952 అక్టోబర్ 19న నిరాహారదీక్షకు పూనుకున్నారు శ్రీరాములు. ఏమాత్రం ఆర్భాటం లేకుండా ప్రారంభమైన దీక్ష, క్రమక్రమంగా ప్రజల్లో అలజడి రేపింది. అసంఖ్యాకంగా ప్రజలు శ్రీరాములుకు మద్దతుగా సమ్మెలు, ప్రదర్శనలు జరిపారు. చివరికి 1952 డిసెంబర్ 15 అర్ధరాత్రి సమయాన శ్రీరాములు తన ఆశయసాధనలో ప్రాణాలర్పించి అమరజీవి అయ్యాడు. తదుపరి జరిగిన పరిణామాలలో కర్నూలు రాజధానిగా 1953 నవంబర్ 1న ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటుచేస్తూ ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ ప్రకటన చేశారు. ఆ విధంగా ఆంధ్ర రాష్ట్రం ఏర్పడటంలో పొట్టి శ్రీరాములు ఎనలేని త్యాగం చేశారు. పొట్టి శ్రీరాములు స్మృత్యర్థం నెల్లూరు వాసి అయిన ఆయన పేరుని జిల్లాకు చేర్చి గౌరవించింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ