తెలంగాణలోని ప్రతిష్టాత్మక కాళేశ్వరం ప్రాజెక్టు గురించి ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలకు మంత్రి హరీశ్ రావు కౌంటర్ ఇచ్చారు. ఈ ప్రాజెక్టు వలన ఉపయోగం ఏంటి? అని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయని, కాళేశ్వరం ఫలితమేంటో గ్రామాలకు వచ్చి చూస్తే తెలుస్తుందని ఆయన పేర్కొన్నారు. మంగళవారం మంత్రి హరీశ్ రావు సిద్దిపేటలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. సిద్ధిపేట పట్టణ శివారు ఎల్లమ్మ ఆలయం వద్ద నుంచి ఇల్లంతకుంట రోడ్డు విస్తరణలో భాగంగా మొదటి విడుతలో సుమారు రూ.66 కోట్ల వ్యయంతో సిద్ధిపేట నుంచి చిన్నకోడూరు వరకు చేపట్టిన నాలుగు లైన్ల రహదారి నిర్మాణ పనులను ప్రారంభించారు. అలాగే రంగనాయక సాగర్ ప్రాజెక్టు ఆయకట్టు కింద పంట పొలాలకు ఎడమ కాలువ ద్వారా నీటిని విడుదల చేశారు.
ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ ఎంతో ముందుచూపుతో కాళేశ్వరం సహా ఎన్నో ప్రాజెక్టులకు రూపకల్పన చేశారని, తద్వారా తెలంగాణ అంతటా సాగునీరు, త్రాగునీరు పుష్కలంగా లభిస్తున్నాయని తెలిపారు. రాష్ట్రంలో ఒకప్పుడు రైతాంగం వర్షాలపై ఆధారపడి పంటలు వేసేదని, కానీ ఇప్పుడు ఏడాదికి రెండు పంటలు పండించేలా సాగునీరు అందుతోందని అన్నారు. ఇక రంగనాయక సాగర్ ప్రాజెక్టును పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని హరీశ్ రావు జిల్లా ప్రజలకు హామీ ఇచ్చారు. పొలాలకు రైతుల కోరిక మేరకు నేడు నీరు విడుదల చేశామన్న మంత్రి, పంటలకు నీళ్లు అందించే అవకాశం సీఎం కేసీఆర్ తమకు ఇచ్చారని, దీనిని సద్వినియోగం చేసుకుంటామని తెలిపారు. ఎడమ కాలువ ద్వారా తొలి విడతలో 100 క్యూసెక్కులు, రెండో విడతలో మరో 300 క్యూసెక్కులు విడుదల చేయనున్నామని, నారాయణరావుపేట-చిన్నకోడూర్ మండలాల్లోని గ్రామాల పరిధిలోని పొలాలకు దాదాపు 512 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తామని మంత్రి హరీశ్ వెల్లడించారు.
ఇక ఇప్పటికే నారాయణరావుపేట మండలం పరిధిలో చెరువులు, చెక్ డ్యాములు, కుంటలు, వాగులు ద్వారా దాదాపు 2,840 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందుతోందని, అలాగే రంగనాయక సాగర్ ఎడమ కాలువ పరిధిలో మైనర్ కెనాల్, సబ్ మైనర్ కెనాల్, పంట కాల్వల ద్వారా మొత్తం 70వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించనున్నామని మంత్రి వివరించారు. అయితే ప్రతిపక్ష పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలు రాష్ట్రంలో రైతులకు నీరు అందడం లేదని సభల్లో మాట్లాడుతున్నారని, కాళేశ్వరం నీళ్లతో ఎకరం భూమి కూడా తడవలేదని విమర్శిస్తున్నారని హరీశ్ రావు మండిపడ్డారు. ఆ నాయకులు ఒక్కసారి గ్రామాలకు వచ్చి చూస్తే కాళేశ్వరం ప్రాజెక్టు ఫలితమేంటో తెలుస్తుందని, తాము చెప్పడం కాదని, నీరు అందుతున్న రైతులే వారికి సమాధానం చెప్తారని అన్నారు. ప్రతిపక్ష నేతలు రైతుల పంట పొలాల్లో నీరు పారుతుంటే సహించలేకపోతున్నారని, వారికి కళ్ళు ఉండి కూడా పొలాల వైపు చూడలేకపోతున్నారని హరీశ్ రావు విమర్శించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE