దుబ్బాక అసెంబ్లీ నియోజక వర్గ ఉపఎన్నికలో బీజేపీ అభ్యర్థి ఎం.రఘునందన్ రావు విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి సోలిపేట సుజాత తరపున ప్రచార బాధ్యతలు నిర్వహించిన టిఆర్ఎస్ కీలక నేత, రాష్ట్ర మంత్రి హరీశ్ రావు పార్టీ ఓటమిపై మీడియాతో మాట్లాడారు. ఉపఎన్నికలో ఓటమికి గల కారణాలను సమీక్షించుకుంటామని, ఈ ఓటమికి బాధ్యత తానే తీసుకుంటానని మంత్రి హరీశ్ రావు వెల్లడించారు. ముందుగా దుబ్బాక ఉపఎన్నికలో టిఆర్ఎస్ పార్టీకి ఓటు వేసిన ప్రజలందరికి ధన్యవాదాలు తెలిపారు. అలాగే పార్టీకోసం కష్టపడినా కార్యకర్తలు, నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. టిఆర్ఎస్ పార్టీ ఓడిపోయినప్పటికీ దుబ్బాక ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటామని అన్నారు. గెలుపు, ఓటమితో సంబంధం లేకుండా ప్రజల పక్షాన టిఆర్ఎస్ పార్టీ ఎప్పుడూ నిలబడుతుందని మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ