బల్క్ డ్రగ్ పార్కుల కేటాయింపులో తెలంగాణ రాష్ట్రానికి జరిగిన తీవ్ర అన్యాయం జరిగిందంటూ కేంద్ర కెమికల్, ఫెర్టిలైజర్ శాఖ మంత్రి మనసుఖ్ మాండవియాకి తెలంగాణ రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ లేఖ రాశారు. తెలంగాణ పట్ల కేంద్ర సర్కార్ వివక్షపూరిత వైఖరి కొనసాగుతూనే ఉందని మంత్రి కేటీఆర్ అన్నారు. తాజాగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన బల్క్ డ్రగ్ పార్క్ పథకంలో తెలంగాణకు చోటు దక్కకపోవడమే ఇందుకు సాక్ష్యం అన్నారు. లైఫ్ సైన్సెస్- ఫార్మా రంగాల్లో అంతర్జాతీయ స్థాయిలో దూసుకుపోతున్న దేశ లైఫ్ సైన్సెస్ రాజధాని, వ్యాక్సిన్ క్యాపిటల్ ఆఫ్ వరల్డ్ హైదరాబాద్ నగరాన్ని కావాలనే విస్మరించిందని మంత్రి కేటీఆర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. బల్క్ డ్రగ్ పరిశ్రమ ఏర్పాటుకు ఆంధ్రప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాలను ఎంపిక చేయడం మోదీ సర్కార్ వివక్షాపూరిత రాజకీయాలకు పరాకాష్ట అన్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో రాష్ట్ర ప్రభుత్వం నెలకొల్పుతున్న హైదరాబాద్ ఫార్మాసిటీ పేరును కనీసం పరిశీలించకుండా తెలంగాణ పట్ల తనకున్న వివక్షను కేంద్ర సర్కార్ బయటపెట్టుకుందని కేటీఆర్ విమర్శించారు.
70 శాతం పైగా ముడిసరుకుల కోసం మన దేశ ఫార్మా రంగం చైనాపై ఆధారపడుతోందని, మారుతున్న ప్రపంచ రాజకీయాల దృష్ట్యా బల్క్ డ్రగ్ తయారీలో దేశీయ ఫార్మా రంగం స్వయం సమృద్ధి సాధించాలన్న లక్ష్యంతో 2015 లో 2000 ఏకరాల్లో వివిధ రాయితీలు, ప్రోత్సహకాలతో బల్క్ డ్రగ్ పార్క్ లను ఏర్పాటు చేసే పథకాన్ని కేంద్రం తెరపైకి తీసుకువచ్చిందని మంత్రి కేటీఆర్ చెప్పారు. అయితే అపరిమిత అలస్యం తరువాత, కోవిడ్ సంక్షోభం నేపథ్యంలో పార్కు ఎర్పాటు అవసరం పట్ల కళ్లు తెరిచిన కేంద్రం 2020లో అధికారిక ప్రకటన చేసిందన్నారు. ఆతర్వాత సైతం ప్రతిపాదనలు స్వీకరించి వాటిపైన నిర్ణయం తీసుకునేందుకు మరో రెండు సంవత్సరాలు అలస్యం చేసిందన్నారు. గత కొన్ని సంవత్సరాలుగా, నేటి వరకు ఎన్నో సార్లు బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటు కోసం కేంద్రాన్ని కోరుతూనే ఉన్నామన్నారు. బల్క్ డ్రగ్ పార్క్ ను తెలంగాణకు కేటాయించాలని కేంద్ర ఫార్మాసూటికల్ శాఖకు రాష్ట్ర ప్రభుత్వం తరపున ప్రతిపాదనలను కూడా సమర్పించామని చెప్పారు. హైదరాబాద్ ఫార్మాసిటీ లోని 2000 ఎకరాల్లో ఈ బల్క్ డ్రగ్ పార్క్ ని ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు కేంద్రానికి స్పష్టంగా తెలియచేశామన్నారు. ఫార్మాసిటీ మాస్టర్ ప్లాన్ ను కూడా అందచేశామన్నారు. కీలకమైన భూసేకరణ, పర్యావరణ అనుమతులతో పాటు ఫార్మాసిటీకి ఉన్న సానుకూల అంశాలను వివరిస్తూ కేంద్రానికి సమగ్రమైన నివేదిక ఇచ్చామని తెలిపారు. దీంతోపాటు ఢిల్లీ వెళ్లిన ప్రతీసారి కేంద్ర మంత్రులను కలిసి విజ్ఞప్తి చేసిన విషయాన్ని కేటీఆర్ ఈ సందర్భంగా గుర్తు చేశారు.
బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటు చేయాలని 2015లో నిర్ణయం తీసుకున్న నరేంద్ర మోదీ సర్కార్, ప్రతిపాదనల పరిశీలన, ఇతర అంశాల పేరుతో 2021 వరకు టైంపాస్ చేసిందని మంత్రి కేటీఆర్ ఆరోపించారు. తాజాగా ప్రకటించిన జాబితాలో అన్ని సిద్దంగా ఉన్న తెలంగాణకు చోటు దక్కకపోవడం తమను షాక్ గురించేసిందని అన్నారు. కొత్తగా బల్క్ డ్రగ్ పార్క్ ను ఏర్పాటు చేయాలంటే భూసేకరణ, ప్లానింగ్, డిజైన్, పర్యావరణ, ఇతర అనుమతులు తీసుకోవడానికే కనీసంగా మూడు సంవత్సరాల సమయం పడుతుందని మంత్రి కేటీఆర్ చెప్పారు. చైనాతో ప్రస్తుతం ఉన్న ఉద్రిక్తతల దృష్ట్యా సాధ్యమైనంత త్వరగా దేశీయ ఫార్మా రంగం స్వయం సమృద్ధిని సాధించాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. దేశ ఫార్మా రంగాన్ని నిజంగా అత్మనిర్భరత వైపు త్వరగా తీసుకుపోవాలన్న కేంద్ర ఉద్దశ్యం పట్ల చిత్తశుద్ది ఉంటే కనీసం మరో రెండు మూడేళ్లు పట్టే ప్రాంతాలకు పార్కుల కేటాయింపు చేసేది కాదన్నారు. బల్క్ డ్రగ్ పార్క్ ల ఏర్పాటులో అన్ని రకాల అనుకూలతలు, అనుమతులు ఉన్న ఫార్మాసిటీని ఏమాత్రం పరిగణలోకి తీసుకోకుండా తన నిబద్ధత లేమిని నరేంద్ర మోదీ సర్కార్ బయటపెట్టుకుందని మంత్రి కేటీఆర్ ఎద్దేవా చేశారు.
తెలంగాణ రాష్ట్రానికి బల్క్ డ్రగ్ పార్క్ ను కేటాయిస్తే వెంటనే పని ప్రారంభించవచ్చన్న కనీస సోయి కేంద్ర ప్రభుత్వానికి లేకపోవడం దేశ ప్రజల దురదృష్టం అన్నారు. నరేంద్ర మోదీ సర్కార్ నిర్వాకంతో దిగుమతుల కోసం వీదేశాలపై ఆధారపడుతున్న ఫార్మా పరిశ్రమకు తీవ్ర నష్టం జరుగుతోందన్నారు. దీంతో దేశ ప్రయోజనాలకు విఘాతం కలగడంతో పాటు బల్క్ డ్రగ్ తయారీ రంగంలో స్వయం సమృద్ధి సాధించాలన్న ఆశయానికి తూట్లు పొడవడమేనని విమర్శించారు. మోదీ సర్కార్ నిర్ణయంతో తెలంగాణతో పాటు యావత్ దేశం కూడా భారీగా నష్టపోతుందన్నారు. ప్రపంచ స్థాయి ప్రమాణాలతో దీర్ఘకాలిక విజన్ తో జీరో లిక్విడ్ డిశ్చార్జ్, కామన్ట్ ట్రీట్మెంట్ ప్లాంట్, ఇంటిగ్రేటెడ్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ఫెసిలిటీ, పూర్తిస్థాయి హీటింగ్, కూలింగ్ వ్యవస్థల ఏర్పాటు, కామన్ డ్రగ్ డెవలప్మెంట్ అండ్ టెస్టింగ్ లాబరేటరీ వంటి అనేక వినూత్న విభాగాల సమాహారంగా తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటుచేస్తున్న హైదరాబాద్ ఫార్మాసిటీని జాతీయ ప్రాధాన్యత కలిగిన ప్రాజెక్టుగా కేంద్రం ఇదివరకే గుర్తించిందని కేటీఆర్ తెలిపారు. దీంతోపాటు నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ట్రస్ట్ కింద హైదరాబాద్- వరంగల్ ఇండస్ట్రియల్ కారిడార్ ప్రాజెక్టు ప్రాధాన్యతను దక్కించుకుందని చెప్పారు.
ఫార్మాసిటీ ప్రాధాన్యతను గుర్తించి ప్రశంసించిన కేంద్రమే బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటులో హైదరాబాద్ ని విస్మరించడం ఆశ్చర్యానికి గురి చేసిందని మంత్రి కేటీఆర్ అన్నారు. ఈ ఎంపిక పట్ల అనేక అనుమానాలు ఉన్నాయన్నారు. దేశీయ ఫార్మా రంగాన్ని స్వయం సమృద్ధిగా మార్చాలన్న తమ లక్ష్యానికి కేంద్ర ప్రభుత్వం నిజంగానే కట్టుబడి ఉంటే తెలంగాణలో వెంటనే బల్క్ డ్రగ్ పార్క్ ను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. బల్క్ డ్రగ్ పార్కుల కేటాయింపులో తెలంగాణని విస్మరించడమంటే దేశీయ ఫార్మా రంగం పురోగతిని దారుణంగా దెబ్బతీయడమే అని విమర్శించారు. రాజకీయ ప్రజయోజనాల కోసం దేశ ప్రయోజనాలను పణంగా పెట్టొద్దని మంత్రి కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు దార్శనిక నాయకత్వంలో హైదరాబాద్ ఫార్మసిటీని అద్భుతంగా తీర్చిదిద్దుతున్నామని, బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటు చేసి తమ ప్రయత్నాలకు చేదోడు వాదోడుగా నిలవాలని కేంద్రాన్ని మంత్రి కేటీఆర్ కోరారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY