తెలంగాణలో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు పాలన సంక్షేమానికి స్వర్ణయుగం అని పేర్కొన్నారు రాష్ట్ర ఆర్థికశాఖ మరియు వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్ రావు. ఈ మేరకు ఆయన శుక్రవారం తెలంగాణ దశాబ్ది వేడుకల్లో భాగంగా సిద్దిపేటలో నిర్వహించిన సంక్షేమ ఉత్సవాలకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ.. రాష్ట్రంలోని వృద్ధులు, వికలాంగులు ఆత్మగౌరవంతో బ్రతికేలా చేశారని, కుటుంబంలో పెద్ద కొడుకులా అండగా ఉంటూ వారికి ఆసరా పెన్షన్లు అందిస్తున్నారని తెలిపారు. కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ వంటి పథకాలతో పేదింటి ఆడ పిల్లల పెళ్లిళ్లకు ఆర్ధిక సాయం చేస్తున్నారని, రైతు బంధు, దళితబంధు పథకాలతో ఆయా వర్గాలను ఆదుకుంటున్నారని వెల్లడించారు. అలాగే మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి సురక్షిత మంచి నీళ్లు, కాళేశ్వరం ద్వారా లక్షలాది ఎకరాలకు సాగునీరు ఇస్తున్నారని చెప్పారు.
ఇక రాష్ట్రవ్యాప్తంగా విద్యా ప్రమాణాలు మెరుగుపరిచారని, ప్రభుత్వ పాఠశాలలను ప్రైవేట్ స్కూల్స్ కు ధీటుగా తయారుచేశారని పేర్కొన్నారు. కాగా ఈ తొమ్మిదేళ్ల పాలనలో రాష్ట్రంలో 21 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేశామని, అలాగే ప్రభుత్వ ఆస్పత్రుల్లో 33 వేల పడకలు ఏర్పాటు చేశామని తెలిపారు. సీఎం కేసీఆర్ 14 ఏళ్ల పాటు సాగిన రాష్ట్ర సాధన ఉద్యమంలో కేసీఆర్ ఎన్నో పదవులను త్యాగం చేశారని గుర్తు చేశారు. ఈ క్రమంలో వరుసగా రెండోసారి ఎన్నికల్లో విజయం సాధించి అధికారంలోకి వచ్చారని, రానున్న ఎన్నికల్లో మరోసారి గెలిచి హ్యాట్రిక్ సాధించనున్నారని చెప్పారు. కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణలో అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని, బీఆర్ఎస్ మోడల్కు దేశవ్యాప్తంగా విశేష స్పందన లభిస్తోందని తెలిపారు. అయితే, కేంద్రం వైఫల్యాలను ప్రశ్నించినందుకు సీబీఐ, ఈడీ కేసులు, ఆదాయపు పన్ను శాఖ దాడులతో బీఆర్ఎస్ నేతలను బెదిరించేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందని, కానీ ఇలాంటి బెదిరింపులకు బీఆర్ఎస్ భయపడబోదని మంత్రి హరీశ్ రావు తేల్చి చెప్పారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY