కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మరియు ఢిల్లీ మద్యం కుంభకోణంలో విచారణపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆదివారం సీబీఐ విచారణ అనంతరం ఆమె స్పందించడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. సోమవారం తెలంగాణ జాగృతి విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్న ఆమె శ్రేణులను ఉద్దేశించి మాట్లాడారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత ప్రసంగిస్తూ.. బీజేపీ అధికారంలోకి వచ్చిన ఈ ఎనిమిదేళ్లలో దేశవ్యాప్తంగా ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన 8 ప్రభుత్వాలను కూల్చిందని, అధికారం చేపట్టడానికి ఏం చేసేందుకైనా వెనుకాడటం లేదని మండిపడ్డారు. బీజేపీయేతర ప్రభుత్వాలను కూల్చడంమే పనిగా పెట్టుకుందని, దీనిలో భాగంగానే తాజాగా తెలంగాణలో బీజేపీ కేంద్ర దర్యాప్తు సంస్థలను ప్రయోగిస్తోందని పేర్కొన్నారు. అయితే ఇలాంటి వాటికి ఇక్కడ భయపడేవారెవరూ లేరని, ఎలాంటి విచారణాలైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని స్ఫష్టం చేశారు. తెలంగాణ ఆడపిల్లల కళ్ల నుంచి నీళ్లు రావని, నిప్పులు వస్తాయని ఆమె పేర్కొన్నారు.
బీజేపీ అవలంబిస్తున్న అప్రజాస్వామిక నిర్ణయాలపై ప్రశ్నించాల్సిన మీడియాకు ధైర్యం లేదని, ఫోర్త్ ఎస్టేట్గా ఉండాల్సిన మీడియా నేడు బీజేపీ ప్రైవేట్ ఎస్టేట్గా మారిందని కవిత మండిపడ్డారు. ప్రస్తుతం దేశ ఆర్ధిక వ్యవస్థ గాడి తప్పుతోందని, అయితే ప్రజల మధ్య వైషమ్యాలు సృష్టించి వీటినుంచి దృష్టి మరలుస్తున్నారని అన్నారు. తెలంగాణ జాగృతి తరుపున దేశం అంతా తిరిగి ప్రజల్లో చైతన్యం తీసుకువస్తామని, దేశవ్యాప్తంగా కవులను, రచయితలను, కళాకారులను, రైతులను, విద్యార్థులను ఇలా ప్రతి ఒక్కరినీ ఏకం చేయాల్సిన అవసరం ఉందని వెల్లడించారు. కేంద్రం వ్యవస్థలను దెబ్బతీసి తనకు అనుగుణంగా వినియోగించుకుంటోందని ఆరోపించిన కవిత.. అనవసర లీకులిచ్చి నేతల వ్యక్తిత్వ హననానికి పాల్పడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక బీజేపీ ఆటలు ఎక్కడైనా సాగుతాయేమో కానీ, తెలంగాణలో మాత్రం సీఎం కేసీఆర్ ఉన్నారని గుర్తుంచుకోవాలని హెచ్చరించారు. తనపై ఎన్ని సంస్థలను ప్రయోగించినా బెదిరేది లేదని, బీజేపీకి ప్రత్యామ్నాయంగా బీఆర్ఎస్ పార్టీ నిలుస్తుందని ఎమ్మెల్సీ కవిత స్పష్టం చేశారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ