తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ మంగళవారం సీఐఐ తెలంగాణ రాష్ట్ర వార్షిక సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఈ సందర్బంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ, తెలంగాణకు అనేక బలాలు ఉన్నాయని, వాటిని ఏకీకృతం చేయగలమని అన్నారు. గ్లోబల్ వ్యాక్సిన్ అవుట్పుట్లో హైదరాబాద్ 35% వాటాను కలిగి ఉందని, భారతదేశం యొక్క ఫార్మాస్యూటికల్స్లో 40% ఉత్పత్తి చేస్తుందని చెప్పారు. జీనోమ్ వ్యాలీ మరియు మెడికల్ డివైజెస్ పార్క్లో యూఎస్ ఎఫ్డీఏ ఆమోదించిన ఫార్మా తయారీ సౌకర్యాలు 214 ఉన్నాయన్నారు. ఫార్మా పరిశ్రమలకు ఒకేచోట అత్యుత్తమ వసతులు కల్పిస్తున్నామని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.
వ్యాపారులు, పెట్టుబడులకు రాష్ట్రంలో అద్భుతమైన వాతారణం ఉందని, అమెజాన్, గూగుల్, మైక్రోసాఫ్ట్, అడోబ్ వంటి ప్రపంచ ప్రసిద్ధ సంస్థలు వాటి అతిపెద్ద క్యాంపస్లను హైదరాబాద్ లో ఏర్పాటు చేశాయని తెలిపారు. 2013తో పోలిస్తే రాష్ట్రంలో పెట్టుబడులు రెట్టింపయ్యాయని, 2030 నాటికి 250 బిలియన్ డాలర్లు సాధించాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్నామన్నారు. భారతదేశం యూనియన్ ఆఫ్ స్టేట్స్ అని, రాష్ట్రాలు పటిష్టంగా ఉంటేనే దేశం బలపడుతుందన్నారు. తెలంగాణ వంటి పనితీరు కనబరుస్తున్న రాష్ట్రాలను కేంద్రం ప్రోత్సహించాలని, అప్పుడే మనం భారతదేశాన్ని మొదటి ప్రపంచ దేశంగా చూడగలం అని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ ఉత్తమ ఇన్నోవేషన్, స్టార్టప్, స్థిరమైన పద్ధతులు, సీఎస్ఆర్ పద్ధతులు, ఎగుమతి పనితీరు, ప్రత్యేక సహకారం (ఐటీ సేవలు), ఐపీఆర్ పోర్ట్ఫోలియోలకు తెలంగాణ రాష్ట్ర పరిశ్రమ అవార్డులను ప్రదానం చేశారు.
మరోవైపు ప్రసంగం సందర్భంగా వచ్చే ఎన్నికల్లో అధికారంపై మంత్రి కేటీఆర్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. సభను ఉద్దేశించి మాట్లాడుతూ, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి రావడానికి మాకు ఓటేయండి, 2023లో మళ్ళీ తిరిగి ప్రభుత్వంగా రాగలమని నిర్ధారించండి అనగా అంతా చప్పట్లతో స్పందన తెలిపారు. అనంతరం మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ, మీ నుండి వస్తున్న స్పందన చూస్తే మళ్లీ అధికారంలోకి వస్తాం అనిపిస్తుంది, నేను ఆశాజనకంగా ఉన్నానని పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE