హైదరాబాద్ నగరంలో వివిధ ప్రాజెక్టుల కింద చేపడుతున్న రోడ్ల నిర్మాణం, విస్తరణ పనులపై రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అధికారులతో సమీక్షించారు. జీహెచ్ఎంసీ ఇంజినీరింగ్ అధికారులతోపాటు కమిషనర్, పురపాలకశాఖ ముఖ్య కార్యదర్శి, నగర మేయర్ బొంతు రామ్మోహన్ ఈ సమీక్షకు హాజరయ్యారు. ప్రస్తుతం ఎస్సార్డీపీ పనులు వేగంగా కొనసాగుతున్నాయని త్వరలో పూర్తి చేస్తామని అధికారులు తెలిపారు. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకొని నగరంలో రోడ్ల విస్తరణ, నిర్మాణం చేపట్టాలని మంత్రి కేటీఆర్ అధికారులకు సూచించారు.
హైదరాబాద్ నగరాన్ని నాలుగు జోన్లుగా విభజించి ఒక్కో జోన్ లో ప్రస్తుతం ఉన్న రోడ్లతో పాటుగా భవిష్యత్తులో నిర్మించాల్సినవి, విస్తరించాల్సినవి గుర్తించి నివేదిక అందించాలని మంత్రి కేటిఆర్ ఆదేశించారు. నివేదికలో ప్రస్తుత రోడ్లతో పాటు భవిష్యత్తులో ఏర్పడే జంక్షన్లు, బస్ బేలు, టాయిలెట్ల ప్రతిపాదనలు ఉండాలన్నారు. రోడ్డు నిర్మాణ కన్సల్టెంట్లు, సంస్థతో కలిసి నెలరోజుల్లోగా ప్రాథమిక నివేదిక సిద్ధం చేయాలని సూచించారు. నగరంలోని ప్రతి వంద ఫీట్ల రోడ్ల వెంట మొక్కలు పెంచాలని జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్ కుమార్ను ఆదేశించారు. ప్రస్తుతం కొనసాగుతున్న గ్రిడ్ రోడ్లు, రేడియల్ రోడ్లు, మిస్సింగ్, లింకు రోడ్ల నిర్మాణ పనుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. మొదటి దశలో చేపట్టిన 23 లింకు రోడ్ల నిర్మాణం ఈ నెలాఖరు నాటికి పూర్తి చేస్తామని అధికారులు తెలిపారు. ప్రస్తుతం చేపట్టిన సీఆర్ఎంపీ రోడ్ల నిర్వహణ సత్ఫలితాలను ఇస్తున్నదని పేర్కొన్నారు. జూన్ లో అధిక వర్షపాతం నమోదైనా రోడ్లకు సంబంధించిన ఫిర్యాదులు ఎక్కువగా రాలేదని మంత్రి కేటిఆర్ దృష్టికి తీసుకువచ్చారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu