అబ్దుల్లాపూర్మెట్ మండలం బాటసింగారం వద్ద అత్యున్నత ప్రమాణాలతో నిర్మించిన హెచ్ఎండిఏ ట్రక్ డాక్ లాజిస్టిక్స్ పార్క్ను తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ గురువారం నాడు ప్రారంభించారు. రూ.40 కోట్లతో 40 ఎకరాల్లో ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంతో నిర్మించిన ఈ లాజిస్టిక్ పార్కులో 2 లక్షల చదరపు అడుగుల సామర్ధ్యం గల గోడౌన్ తో పాటుగా, 10 వేల మెట్రిక్ టన్నుల సామర్ధ్యం గల కోల్డ్ స్టోరేజ్, 500 ట్రక్కులు నిలిపేందుకు పార్కింగ్ స్థలం ఏర్పాటు చేశారు. అలాగే 200 మంది డ్రైవర్లు విశ్రాంతి తీసుకునేందుకు వీలుగా విశ్రాంతి గదులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, రెస్టారెంట్, ఆటోమొబైల్ సర్వీస్ వంటి సకల సౌకర్యాలను ఈ లాజిస్టిక్స్ పార్క్ లో అందుబాటులో ఉంచారు.
దేశం నలుమూలల నుంచి వచ్చే సరుకు రవాణా వాహనాలకు అవసరమైన అన్ని రకాల సేవలను అందించడమే లక్ష్యంగా ఓఆర్ఆర్ చుట్టూ రాష్ట్ర ప్రభుత్వం లాజిస్టిక్ పార్కులను నిర్మిస్తున్నది. ఇప్పటికే ఇబ్రహీంపట్నం సమీపంలోని మంగలపల్లిలో 22 ఎకరాల్లో లాజిస్టిక్ పార్కును నిర్మించి అందుబాటులోకి తీసుకురాగా, తాజాగా హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై ఔటర్ రింగురోడ్డుకు సమీపంలో బాటసింగారం వద్ద అత్యున్నత ప్రమాణాలతో హెచ్ఎండిఏ-ట్రక్ డాక్ లాజిస్టిక్స్ పార్క్ను అందుబాటులోకి తెచ్చారు. లాజిస్టిక్స్ పార్క్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి, స్థానిక ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి, పురపాలక మరియు పట్టణాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ అర్వింద్ కుమార్, ఇతర అధికారులు పాల్గొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ