నిర్మల్ జిల్లాలోని బాసర ఆర్జీయూకేటీ విద్యాలయంకు చెందిన విద్యార్థులు గత వారం రోజులుగా ఆందోళన చేపడుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సోమవారం రాత్రి రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డితో జరిపిన చర్చలు సఫలం కావడంతో, విద్యార్థులు తమ ఆందోళనను విరమిస్తున్నట్టు ప్రకటించారు. మంగళవారం నుంచి తరగతులకు హాజరుకానున్నట్టు తెలిపారు. ముందుగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి సోమవారం రాత్రి 9.30 గంటలకు బాసర ఆర్జీయూకేటీకి చేరుకున్నారు. ఆర్జీయూకేటీలో నెలకొన్న సమస్యలు, మౌలిక వసతులుపై విద్యార్థులు లేవనెత్తుతున్న డిమాండ్లపై డైరెక్టర్ సతీష్ కుమార్, ఉపకులపతి రాహుల్ బొజ్జా, విద్యాశాఖ కమిషనర్ వాకాటి అరుణ, ఉన్నత విద్యా శాఖ మండలి వైస్ చైర్మన్ వెంకటరమణ, కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూకి, స్థానిక ఎమ్మెల్యే విట్టల్ రెడ్డితో మంత్రి చర్చించారు. అనంతరం వీరంతా విద్యాలయంకు చెందిన 20 మంది స్టూడెంట్ గవర్నింగ్ కౌన్సిల్ విద్యార్థులతో అర్ధరాత్రి వరకు పలు అంశాలపై చర్చించారు.
చర్చలు అనంతరం విద్యార్థులు మీడియాతో మాట్లాడుతూ, తమ 12 డిమాండ్లను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తామని ప్రభుత్వం తరఫున మంత్రి సబితా ఇంద్రారెడ్డి హామీ ఇవ్వడంతో తమ ఆందోళనను విరమిస్తున్నట్టు ప్రకటించారు. తమ డిమాండ్ల పరిష్కారంతో పాటుగా వీసీ నియామకంపై స్పష్టమైన హామీ ఇచ్చారని చెప్పారు. అలాగే బాసర ఆర్జీయూకేటీలో మౌలిక సదుపాయాల కోసం తక్షణమే రూ.5.6 కోట్లను ప్రభుత్వం మంజూరు చేస్తుందని తెలిపారు. మరోవైపు విద్యార్థులతో చర్చలు సఫలంపై మంత్రి సబితా ఇంద్రారెడ్డి ట్విట్టర్ లో స్పందిస్తూ, “బాసర ఐఐఐటీ విద్యార్థులకు శుభాకాంక్షలు. ఇచ్చిన వాగ్దానాలన్నింటినీ ఈ ప్రభుత్వం నెరవేరుస్తుంది” అని పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY