జీహెఛ్ఎంసీ ఎన్నికల సందర్భంగా హైదరాబాద్ నగర ప్రజలకు ఉచిత తాగునీటి సరఫరా అమలు చేస్తామని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మంగళవారం ఉదయం గ్రేటర్ హైదరాబాద్లో ఉచిత తాగునీటి పథకాన్ని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అధికారికంగా ప్రారంభించారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గ పరిధిలోని రహమత్ నగర్లో ఈ పథకాన్ని మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ పథకం కింద 20వేల లీటర్ల వరకు నీటి వినియోగానికి ఎలాంటి చార్జీలు చెల్లించాల్సిన అవసరం లేకుండా ప్రజలకు నీటి సరఫరా చేయనున్నారు. జనవరిలో జారీ చేసే డిసెంబర్ బిల్లు నుంచే ఈ ఉచిత పథకం అమల్లోకి వస్తుందని చెప్పారు. డిసెంబర్ 2020 మాసానికి సంబంధించి 20 వేల లీటర్ల వరకు నీటిని వాడుకున్నవారు బిల్లులు చెల్లించాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు.
బస్తీల్లో నివసిస్తున్న గృహ వినియోగదారులుకు వాటర్ మీటర్ లేకున్నా ఈ పథకాన్ని అమలు చేయనున్నారు. ఇక నగరంలోని మిగతా ప్రాంతాల్లో, అపార్ట్ మెంట్లలో ఉన్న వారు తప్పనిసరిగా వాటర్ మీటర్ కలిగిఉండాలి. ప్రతి వినియోగదారులు తమ వాటర్ మీటర్లు వర్కింగ్ కండిషన్ ఉండే విధంగా సరిచూసుకోవాలని సూచించారు. అలాగే మీటర్లు లేనివారు తప్పనిసరిగా వాటర్ మీటర్లు బిగించుకోవాలని పేర్కొన్నారు. 20వేల లీటర్ల నీటి వినియోగం దాటితే పాత ఛార్జీలకు అనుగుణంగా జలమండలి అధికారులు బిల్లు వసూలు చేయనున్నారు. ఉచిత తాగునీటి సరఫరా పథకం ద్వారా నగరంలో నివసిస్తున్న సుమారు 97% పేద, మధ్య తరగతి కుటుంబాలకు లబ్ధి చేకూరనుంది. ఈ కార్యక్రమంలో మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీ, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, మేయర్ బొంతు రామ్మోహన్, చీఫ్ సెక్రెటరీ సోమేశ్ కుమార్, ప్రిన్సిపల్ సెక్రెటరీ అర్వింద్ కుమార్, హెచ్ఎండబ్ల్యూఎస్ ఎండి దాన కిషోర్ తదితరులు పాల్గొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ