తెలంగాణ రాష్ట్రంలో బర్డ్ ఫ్లూ లక్షణాలు లేవని, పౌల్ట్రీ ఇండస్ట్రీకి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా నిలుస్తుందని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు మంగళవారం బి.ఆర్.కె.ఆర్. భవన్ లో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్, చేవెళ్ళ పార్లమెంటు సభ్యుడు రంజిత్ రెడ్డితో కలసి పౌల్ట్రి ఇండస్ట్రీ ప్రతినిధులు, వివిధ సంస్థల నుండి వచ్చిన సైంటిస్టులు, ప్రొఫెసర్లు, పౌల్ట్రి రంగ నిపుణులు, పశువైద్య శాఖ అధికారుల తో నిర్వహించిన సమావేశంలో బర్డ్ ఫ్లూపై ప్రభుత్వం తీసుకుంటున్న ముందు జాగ్రత్త చర్యల గురించి మంత్రి తలసాని వివరించారు. సమావేశం అనంతరం పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి శాఖల కార్యదర్శి అనితా రాజేంద్రతో కలసి మీడియా ప్రతినిధులతో మంత్రి తలసాని మాట్లాడారు.
బర్డ్ ఫ్లూపై రాష్ట్ర వ్యాప్తంగా 1300 రాపిడ్ రెస్పాన్స్ టీమ్స్ ఏర్పాటు:
ఈ సమావేశంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రంలో పౌల్ట్రి ఇండస్ట్రీ దేశంలోనే మూడో స్థానంలో ఉన్నదని, ఇతర రాష్ట్రాలు, దేశాలకు పౌల్ట్రీ ఉత్పత్తులను ఎగుమతి చేస్తున్నామని తెలిపారు. చికెన్, గుడ్లు తినడం వలన ఎటువంటి నష్టం జరగదని, మనకు ప్రోటీన్ లు లభిస్తాయని తెలిపారు. ఇతర రాష్ట్రాలలో బర్డ్ ఫ్లూ సోకినట్లు సమాచారం అందిన వేంటనే సీఎం ఆదేశాల మేరకు పశుసంవర్ధక, వైద్య ఆరోగ్య శాఖలను అప్రమత్తం చేసినట్లు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 1300 రాపిడ్ రెస్పాన్స్ టీమ్ లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రాష్ట్ర, జిల్లా, క్షేత్ర స్థాయిలలో పశుసంవర్ధక, ఆరోగ్య, అటవీ శాఖలతో పాటు సరిహద్దు జిల్లాల కలెక్టర్లతో సమన్వయంతో వ్యవహరిస్తున్నట్లు తెలిపారు.
నల్గొండ, వరంగల్, పెద్దపల్లి జిల్లాలలో కోళ్లు మృతి చెందినట్లు మీడియా లో వచ్చిన వార్తలకు ప్రభుత్వం వెంటనే స్పందించి 276 శ్యాంపిల్స్ ను సేకరించి పరీక్షలు చేయించగా, నెగెటీవ్ రీపోర్ట్ వచ్చినట్లు తెలిపారు. అదేవిధంగా గత మూడు రోజులలో 1000 శ్యాంపిల్స్ పరీక్షించగా నెగెటీవ్ వచ్చినట్లు తెలిపారు. క్షేత్ర స్థాయిలో చేపట్టిన చర్యలు, శ్యాంపిల్స్ సేకరణ, పరీక్షలపై ప్రజలలో విస్తృత స్తాయిలో ప్రచారం కల్పించి పౌల్ట్రి పరిశ్రమను కాపాడుటకు ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరిస్తుందని తెలిపారు. కోవిడ్-19 ప్రారంభంలో పౌల్ట్రి ఉత్పత్తులపై పడిన ప్రభావాన్ని నివారించుటకు చేపట్టిన చర్యలతో పౌల్ట్రి పరిశ్రమ కోలుకుందని తెలిపారు. మన రాష్ట్రానికి వచ్చే వలస పక్షుల సంఖ్య చాలా పరిమితం అని తెలిపారు. ఈ అంశంపై నీటిపారుదల, అటవీ శాఖ అధికారులతో మానిటరింగ్ చేస్తున్నట్లు తెలిపారు. బర్డ్ ఫ్లూపై మీడియాలో వస్తున్న కథనాల వలన కొంత ఇబ్బందికర పరిస్థితులు నెలకొంటున్నాయని, ప్రభుత్వ పరంగా చేపట్టిన చర్యల గురించి ప్రజలకు అవగాహన కల్పించుటలో సహకరించాలని మిడియాకు మంత్రి విజ్ఞప్తి చేశారు.
రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ మాట్లాడుతూ, రాష్ట్రంలో పౌల్ట్రి ఇండస్ట్రీకి ప్రత్యేక గుర్తింపు ఉన్నదని పేర్కొన్నారు. గతంలో బర్డ్ ఫ్లూ వలన పౌల్ట్రి ఇండస్ట్రీ మాత్రమే నష్టపోయినట్లు తెలిపారు. మనుషులకు ఎక్కడ నష్టం జరగలేదని తెలిపారు. మన శరీరానికి తక్కువ ఖర్చుతో అధిక విలువలువున్న ప్రోటీన్ లను అందించే శక్తి చికెన్, గుడ్ల కు మాత్రమే ఉన్నదని పేర్కొన్నారు. పౌల్ట్రి ఇండస్ట్రీని కాపాడుటకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని తెలిపారు. ఉడికించిన చికెన్, గుడ్లతో నష్టం లేదని మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ