తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ గురువారం నాడు హైదరాబాద్ లోని కండ్లకోయలో నిర్మిస్తున్న “తెలంగాణ గేట్ వే” ఐటీ పార్కుకు శంకుస్థాపన చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినమైన ఈరోజు (ఫిబ్రవరి 17) ఐటీ పార్కుకు శంకుస్థాపన చేయడం సంతోషంగా ఉందని మంత్రి కేటీఆర్ అన్నారు. కండ్లకోయలో మొత్తం 10.11 ఎకరాలల్లో 40 మీటర్ల ఎత్తు, 14 అంతస్తులతో ఈ ఐటీ పార్కును ప్రభుత్వం నిర్మిస్తుంది. ఈ ఐటీ పార్కు ద్వారా దాదాపు 50 వేల మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నట్టు తెలుస్తుంది. ఈ కార్యక్రమంలో కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి, ఎమ్మెల్సీలు శంబీపూర్ రాజు, నవీన్ కుమార్, ఎమ్మెల్యేలు కేపీ వివేకానంద, మాధవరం కృష్ణారావు, పలువురు నాయకులు, అధికారులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ, ఈ గేట్ వే ఐటీ పార్కును 6 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మిస్తున్నామని చెప్పారు. సీఎం కేసీఆర్ గురించి మాట్లాడుతూ అనేక ఇబ్బందులు ఎదుర్కొని ఈ స్థాయికి ఎదిగారని చెప్పారు. సీఎం కేసీఆర్ ఎమ్మెల్యేగా తోలి ఎన్నికల్లోనే ఓడిపోయారని, అయినా నిరుత్సహపడకుండా ముందుకు వెళ్లారని అన్నారు. ఆ రోజు ప్రజాజీవితంలో ఉండనని, రాజకీయాలు మానేసి ఉంటే ఈ రోజు తెలంగాణ రాష్ట్రముండేదా, తెలంగాణ రాష్ట్రానికి అద్భుతంగా సారథ్యం వహిస్తూ ముఖ్యమంత్రి అయ్యేవారా అని అన్నారు. ఒక లక్ష్యం పెట్టుకున్నప్పుడు ఎదురుదెబ్బలు తగిలిన, అపజయాలు ఎదురైనా చివరివరకు పోరాడితేనే విజయం సాధిస్తామని మంత్రి కేటీఆర్ తెలిపారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ