హైదరాబాద్ నగరంలో భారీ వర్షాల వలన ప్రభావితమైన కుటుంబాలకు రూ.10 వేల చొప్పున ఆర్ధిక సహాయం అందించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నగరంలో ఈ రోజు నుంచే రూ. 10 వేల ఆర్ధిక సాయం అందించే కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. పలు ప్రాంతాల్లో అధికారులు, ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటిఆర్ కూడా వరద ముంపుకు గురైన ప్రాంతాలలో పర్యటించి ప్రభావిత కుటుంబాలకు ఆర్ధిక సాయాన్ని అందిస్తున్నారు.
అందులో భాగంగా ఖైరతాబాద్ లోని ఎంఎస్ మక్తా మరియు రాజ్ నగర్ లో బాధిత కుటుంబాలకు వారి ఇళ్ల వద్దే రూ.10 వేల సాయాన్ని అందజేశారు. ప్రభుత్వం తరఫున అన్నివిధాలుగా అండగా ఉంటామని ప్రజలకు ఈ సందర్భంగా మంత్రి కేటిఆర్ భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మంత్రి కేటిఆర్ తో పాటుగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, మేయర్ బొంతు రామ్మోహన్, ఇతర అధికారులు పాల్గొన్నారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu