తెలంగాణ రాష్ట్రంలో నేతన్నల సంక్షేమాన్ని రాష్ట్ర ప్రభుత్వం కొనసాగిస్తున్నదని ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. వరంగల్ జిల్లా కొడకండ్లలో మినీ టెక్స్టైల్ పార్కును ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. సోమవారం నాడు ప్రగతి భవన్లో చేనేత, జౌళిశాఖపై మంత్రి కేటీఆర్ సమీక్ష నిర్వహించారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు విజ్ఞప్తి మేరకు కొడకండ్లలో మినీ పార్క్ ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించిన నేపథ్యంతో పార్కు ఏర్పాటుకు చర్యలు చేపట్టినట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు.
కొడకండ్లలో నైపుణ్యం కలిగిన వేలాదిమంది నేత కార్మికులు సరైన ఉపాధి లేక ఇతర రాష్ట్రాలకు వెళ్లారని, స్వరాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం చేనేత రంగానికి మద్దతుగా నిలవడంతో వారంతా తిరిగి వచ్చేందుకు ఆసక్తి చూపుతున్నారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా మినీ టెక్స్టైల్ పార్కు ఏర్పాటుకు సుముఖత వ్యక్తం చేసిన మంత్రి కేటీఆర్కు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కృతజ్ఞతలు తెలిపారు. మినీ పార్క్ ఏర్పాటు ద్వారా ఈ ప్రాంతంలోని 20 వేల చేనేత కుటుంబాలకు ప్రయోజనం కలుగుతుందని మంత్రి ఎర్రబెల్లి చెప్పారు.
పవర్లూమ్ కార్మికులను ఆదుకునేందుకు బతుకమ్మ చీరెల తయారీ:
మరోవైపు గత సంవత్సరాల లాగానే పవర్లూమ్ కార్మికులను ఆదుకునేందుకు ఈ సంవత్సరం కూడా బతుకమ్మ చీరెల తయారీని కొనసాగిస్తామని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. నేతన్నకు చేయూత కార్యక్రమం ద్వారా కరోనా సంక్షోభ సమయంలో కూడా కార్మికులకు పెద్దఎత్తున ప్రయోజనం చేకూరిందని అన్నారు. కాంట్రిబ్యూషన్ మినహాయింపు ద్వారా సుమారు 25 వేల మంది నేతన్నల కుటుంబాలకు రూ.95 కోట్ల మేర లబ్ది జరిగిందన్నారు. ఈ కార్యక్రమాన్ని తిరిగి కొనసాగించాలని నేత కార్మికుల చేస్తున్న విజ్ఞప్తిని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తానని మంత్రి తెలిపారు. ఈ ఏడాదిలో ప్రవేశపెట్టబోయే బడ్జెట్లో టెక్స్టైల్, చేనేత రంగాలకు కేటాయింపులపై కసరత్తు చేసి నివేదిక తయారు చేయాలని ఆ శాఖ అధికారులను మంత్రి కేటీఆర్ ఆదేశించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ