తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. త్వరలో హైదరాబాద్లో వార్డు పాలన పద్ధతికి ప్రణాళికలు వేస్తోంది. ఈ మేరకు రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ప్రకటించారు. బుధవారం ఆయన నూతన సచివాలయంలో మున్సిపాలిటీ శాఖపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. జీహెచ్ఎంసీ పరిధిలోని ప్రజలకు మెరుగైన మరియు తక్షణ సేవలు అందించే ఉద్దేశంతో వార్డుల పాలన పద్ధతికి శ్రీకారం చుడుతున్నట్లు వెల్లడించారు. దీనిలో భాగంగా.. జీహెచ్ఎంసీ పరిధిలోని 150 వార్డుల్లో ముందుగా వార్డు కార్యాలయాలు ఏర్పాటు చేస్తామని, ఈ కార్యాలయాలను మే నెలఖారు లోపు ప్రారంభిస్తామని తెలిపారు.
కాగా ఒక్కో వార్డు కార్యాలయంలో 10 మంది వరకు వివిధ విభాగాలకు చెందిన అధికారులు అందుబాటులో ఉంటారని, అలాగే వీరిపైన ఒక అసిస్టెంట్ మున్సిపల్ కమిషనర్ స్థాయి అధికారి ఇంచార్జిగా ఉంటారని మంత్రి కేటీఆర్ వివరించారు. ఇక జీహెచ్ఎంసీ వార్డు కార్యాలయాలు సిటిజన్ ఫ్రెండ్లీగా ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించిన ఆయన.. ప్రతి వార్డు మరో వార్డు కార్యాలయంతో అనుసంధానమయ్యేలా ఏర్పాట్లు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. నగరంలో స్థానికంగా నివసిస్తున్న ప్రజలు సంబంధిత సేవల కోసం సర్కిల్, జోనల్ ఆఫీసులకు వెళ్లాల్సిన పనిలేకుండా తమ పరిధిలోని వార్డు కార్యాలయంలోనే పొందొచ్చని, ఈ విధమైన పాలన వికేంద్రీకరణతో పౌరులకు వేగంగా సేవలు అందించగలమని మంత్రి కేటీఆర్ అభిప్రాయపడ్డారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE