భారత ఒలింపిక్ సంఘం అధ్యక్షురాలు పీటీ ఉష బుధవారం ఢిల్లీలోని జంతర్ మంతర్కు చేరుకున్నారు. అక్కడ గత 11 రోజులుగా ఆందోళన చేస్తున్న భారత అగ్రశ్రేణి మహిళా రెజ్లర్లను కలుసుకున్నారు. ఈ సందర్భంగా రెజ్లర్లు సాక్షి మాలిక్, వినేష్ ఫోగట్ మరియు బజరంగ్ పునియాలతో పీటీ ఉష కొద్దిసేపు సంభాషించారు. త్వరలోనే పరిస్థితులు చక్కబడతాయని, ధైర్యంగా ఉండాలని ఆమె రెజ్లర్లకు సూచించారు. అంతర్జాతీయ వేదికలపై దేశం ఖ్యాతిని చాటిన ప్రతిభ కలిగిన క్రీడాకారులు నేడు న్యాయం కోసం నినదించడం బాధ కలిగిస్తోందని, వారి సమస్యను పరిశీలించి వీలైనంత త్వరగా పరిష్కరిస్తామని పీటీ ఉష భరోసా ఇచ్చారు. అయితే బ్రిజ్ భూషణ్ జైలుకు వెళ్లేంత వరకు తమ ఆందోళన కొనసాగుతుందని ఈ సందర్భంగా రెజ్లర్లు స్పష్టం చేయడం విశేషం.
ఇక రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఎఫ్ఐ) చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్, పలువురు మహిళా క్రీడాకారులపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని గ్రాప్లర్లు నిరసన వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. కాగా, ఇటీవల పీటీ ఉష రెజ్లర్ల ఆందోళనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. క్రీడాకారులు ఇలా వీధుల్లో నిరసనలు చేయడం క్రమశిక్షణా రాహిత్యమని, కమిటీ రిపోర్ట్ వచ్చే వరకైనా వారు వేచి ఉండాల్సిందని అన్నారు. వారు ఇలా ప్రవర్తించి దేశ ప్రతిష్టను దిగజార్చుతున్నారని ఆమె మండిపడ్డారు. అయితే పీటీ ఉష వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తాయి. రెజ్లర్లతో సహా పలువురు రాజకీయ నేతలు సైతం ఆమె వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుబట్టారు. న్యాయం కోసం పోరాడుతున్న రెజ్లర్ల గురించి తక్కువచేసి మాట్లాడడం సరికాదని మండిపడ్డారు. ఈ నేపథ్యంలోనే ఉష నేడు జంతర్ మంతర్కు వచ్చి ఆందోళన చేస్తున్న రెజ్లర్లను పరామర్శించడం గమనార్హం.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE