తెలంగాణ ప్రభుత్వం జూలై 7వ తేదీ నుంచి 13వ తేదీ వరకు ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న ‘కాకతీయ వైభవ సప్తాహం’ బ్రోచర్ ను మంగళవారం ప్రగతి భవన్ లో రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ఆవిష్కరించారు. రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్, ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ భాస్కర్, భాషా, సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణలతో కలిసి కాకతీయ వైభవ సప్తాహం బ్రోచర్ ను మంత్రి కేటీఆర్ విడుదల చేశారు. అనంతరం కాకతీయ వైభవ సప్తాహం కార్యక్రమ నిర్వహణ, ఏర్పాట్లు, షెడ్యూల్ సహా పలు అంశాలపై మంత్రి కేటీఆర్ సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ, కాకతీయ వైభవ సప్తాహం కార్యక్రమాన్ని పండుగ వాతావరణంలో నిర్వహించాలని చెప్పారు. తెలంగాణ పునర్ నిర్మాణంలో సాంసృతిక పునరుజ్జివనం అనే అంశం ప్రధానమైనదని, ఇదే నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రం సిద్దించిన తర్వాత కాకతీయ పాలనా విధానం ప్రేరణతో ఆనాటి కాకతీయుల గొలుసు కట్టు చెరువుల పునరుద్ధరణ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టారని అన్నారు. కాకతీయులు ప్రజల కొరకు ఎన్నో గొప్ప గొప్ప పనులు చేపట్టారని వాటిని పరిరక్షించుకోవడం మన బాధ్యతని అన్నారు. కాకతీయ పాలనా వైభవం, చారిత్రక విశిష్టత తెలిపేలా కాకతీయ వైభవ సప్తాహంను అత్యంత ఘనంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వ ఉద్దేశ్యమని అన్నారు.
ఈ వేడుకలకు అవసరమైన ఆర్ధిక వనరులను రాష్ట్ర ప్రభుత్వం సమాకురుస్తుందని మంత్రి కేటీఆర్ తెలిపారు. పర్యాటక, సాంస్కృతిక శాఖ, కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అధారిటీ, మున్సిపల్ కార్పొరేషన్ల నుండి అవసరమైన పనులు ఆయా శాఖల పరిధిలో చేపడతామన్నారు. రాజకీయ పార్టీలతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరినీ భాగస్వామి చేస్తూ కార్యక్రమాలను రూపొందించాలని అన్నారు. జిల్లా ప్రజాప్రతినిధులతో, అన్ని పార్టీల నాయకులతో అఖిలపక్ష సమావేశం నిర్వహించి వారి అభిప్రాయాలను, సలహాలను పరిగణలోకి తీసుకోవాలని, జిల్లా స్థాయిలో కమిటీలు ఏర్పాటుచేసి సమన్వయం చేయాల్సిందిగా ప్రభుత్వ ఛీఫ్ విప్ దాస్యం వినయ భాస్కర్ కు మంత్రి కేటీఆర్ సూచించారు. వరంగల్ నగర ప్రధాన కూడల్లన్నింటిలో మొత్తం విద్యుత్ దీపాలంకరణ చేయాలనీ, నిపుణుల చేత కాకతీయ గొలుసుకట్టు చెరువుల నిర్మాణంపై ప్రత్యేక సదస్సు ఏర్పాటు చేయాలన్నారు.
వందేళ్లకు ఒకసారి ఇలాంటి సందర్భం వస్తుంది కాబట్టి కాకతీయ చరిత్రను భావితరాలకు అందించేలా భారీస్థాయిలో కార్యక్రమాలను నిర్వహించాలన్నారు. కళాకారులను, కవులను కూడా భాగస్వామ్యం చేయాలని ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రముఖ కవులు కళాకారులను ఈ సందర్భంగా సన్మానించే విధంగా కార్యక్రమం చేపట్టాలని మంత్రి సూచించారు. కాకతీయ వైభవ సప్తాహం సందర్భంగా ప్రత్యేక పోస్టల్ స్టాంపు విడుదల చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. వేడుకలకు విస్తృత ప్రచారం కల్పించేలా వరంగల్ నగరం అంతటా హోర్డింగులని ఏర్పాటు చేయాలని, డిజిటల్ మీడియాను సమర్ధవంతంగా ఉపయోగించుకోవాలన్నారు. కాకతీయ శిల్పకళా వైభవాన్ని తెలిపేలా కాఫీ టేబుల్ పుస్తకాన్ని రూపొందించాలని అధికారులకు మంత్రి కేటీఆర్ ఆదేశాలు ఇచ్చారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY