హైదరాబాద్ లోని తార్నాక ఆర్టీసీ ఆసుపత్రిలో అధునాతన సౌకర్యాలతో నర్సింగ్ కళాశాల ను ప్రారంభించబోతున్నట్లు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్ఆర్టీసీ) యాజమాన్యం ఇటీవలే ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో గురువారం ఉదయం టీఎస్ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, ఎండీ సజ్జనార్తో కలిసి రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తార్నాకలో “టీఎస్ఆర్టీసీ నర్సింగ్ కళాశాల”ను ప్రారంభించారు. తార్నాక ఆర్టీసీ ఆసుపత్రి ఆవరణలో ఈ ఏడాది నుంచే నర్సింగ్ కళాశాల అందుబాటులోకి రానుందని, దీనిలో ఆర్టీసీ సిబ్బంది పిల్లలకు ఐదు సీట్లను కేటాయిస్తున్నామని మంత్రి పువ్వాడ అజయ్ తెలిపారు. త్వరలోనే వొకేషనల్ కాలేజీ ఏర్పాటుకు కూడా కృషి చేస్తామని అన్నారు.
నర్సింగ్ కళాశాలతో పాటు ఆసుపత్రి ఆవరణలో ఆక్సిజన్ ప్లాంట్, అంబులెన్స్ లు, పరిపాలన భవనాన్ని కూడా నేడు ప్రారంభించారు. రూ.80 లక్షల వ్యయంతో 20 పడకల ఐసీయూ, నాలుగు బెడ్లతో కిడ్నీ సెంటర్, రూ.15 లక్షలతో డయాలసిస్ మిషన్, రూ.1.2 కోట్లతో రౌండ్టేబుల్ ఇండియా సంస్థ వారి ఆక్సిజన్ ప్లాంట్, రూ.1.5 కోట్లతో ఏర్పాటు చేసిన క్యాంటీన్ ను ప్రారంభించినట్టు మంత్రి పువ్వాడ అజయ్ తెలిపారు.
ముందుగా తార్నాక ఆసుపత్రిలో నర్సింగ్ కళాశాలను నెలకొల్పేందుకు రాష్ట్రానికి చెందిన యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ అనుమతిని మంజూరు చేసింది. దీంతో ఈ విద్యా సంవత్సరం నుంచే నర్సింగ్ కాలేజీ అందుబాటులోకి వచ్చింది. ప్రతి ఏటా 50 సీట్లతో టీఎస్ఆర్టీసీ నర్సింగ్ కళాశాలలో అడ్మిషన్స్ జరగనున్నాయి. 30 సీట్లు కన్వీనర్ కోటా కింద, మరో 20 సీట్లు మేనేజ్ మెంట్ కోటా కింద ఉంటాయని తెలిపారు. జంట నగరాల నడిబొడ్డున నెలకొల్పుతున్న ఈ కళాశాలలో వృత్తిపరమైన, అనుభవజ్ఞులైన అధ్యాపకులతో పాటు అత్యాధునిక మౌలిక సదుపాయాలు, విశాలమైన తరగతి గదులు, ప్రయోగశాలల వంటి అన్ని సౌకర్యాలతో తీర్చిదిద్దుతున్నామని టీఎస్ఆర్టీసీ యాజమాన్యం ప్రకటించింది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ